Warangal CP (Tenth Paper Leak Case) : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, వరంగల్ సీపీ రంగనాథ్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. పదో తరగతి హిందీ పేపర్ బయటకొచ్చిన కేసులో సంజయ్ అరెస్టై బెయిల్పై బయటికొచ్చారు. ఆ తర్వాత వరంగల్ సీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో సీపీ స్పందించారు. బండి సంజయ్ ఆరోపణలను ఖండించారు. బండి సంజయ్ ప్రమాణం చేయమంటున్నారు. మేం ప్రమాణం చేసిన తర్వాతే ఉద్యోగంలోకి వస్తామని సీపీ రంగనాథ్ తెలిపారు. ప్రతి కేసులో ప్రమాణం చేయాలంటే.. ఇప్పటి వరకు 10 వేల సార్లు ప్రమాణం చేయాలన్నారు.
పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం బయటకొచ్చిన కేసులో రాజకీయాలకు ఎక్కడా తావులేదన్నారు. బండి సంజయ్ ఫోన్ తమ దగ్గర లేదని సీపీ స్పష్ట చేశారు. తాను ఎలాంటి సెటిల్ మెంట్లు, దందాలు చేయనన్నారు. దర్యాప్తు ఏజెన్సీలను బెదిరించే ప్రయత్నం మంచిది కాదని సూచించారు. బండి సంజయ్తో తనకు ఎలాంటి గట్టు పంచాయితీ లేదని స్పష్టంచేశారు. సత్యంబాబు కేసులో వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. ఆ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోందన్నారు. ఆ కేసు దర్యాప్తు అధికారి తాను కాదన్న విషయం తెలుసుకోవాలన్నారు.
టెన్త్ పేపర్ బయటకొచ్చేలా బండి సంజయ్ కుట్ర చేశారంటూ తొలుత వరంగల్ సీపీ రంగనాథ్ ప్రెస్మీట్లో చెప్పారు. తర్వాత ఈ కేసులో ఏ1 నిందితుడిగా బండి సంజయ్ అరెస్ట్ అయ్యారు. దీంతో తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ.. బండి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సీపీ రంగనాథ్ పై కోర్టులో పరువునష్టం దావా వేసేందుకు సిద్ధమయ్యారు. తన హక్కులకు భంగం కలిగించారంటూ పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు.
వరంగల్ సీపీ రంగనాథ్ను విడిచిపెట్టనంటూ సోమవారం బండి సంజయ్ హెచ్చరించారు. ఆయన ఆస్తుల చిట్టా బయటకు తీస్తామన్నారు. వరంగల్, నల్లగొండ ఎస్పీగా ఉన్న సమయంలో ఏం చేశారో తెలుసన్నారు. దళిత యువకుడు సత్యంబాబు కేసులో రంగనాథ్ పాత్ర ఏంటో కూడా బయటపెడతామన్నారు. దీంతో మంగళవారం ప్రెస్ మీట్ పెట్టి బండి లేవనెత్తిన అన్ని అంశాలకు సీపీ సూటిగా కౌంటర్ ఇచ్చారు. తనపై ఆరోపణలు రుజువు చేస్తే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.