AP Political News : ప్రతి ఇంటిలో వైఎస్ జగన్ ఫొటో ఉండేలా పక్కా రాజకీయ ప్రచారపర్వానికి వైసీపీ తెర తీసింది . మా నమ్మకం నువ్వే జగన్ …. అంటూ ఇంటి గుమ్మాలకు స్టిక్కర్లు అంటించేస్తోంది . కొత్తగా పార్టీ స్థాయిలో నియమించిన గృహసారథుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టింది. ఇంటి యజమాని అనుమతితో ఈ స్టిక్కర్లు ప్రతి ఇంటికీ అంటించేలా కార్యాచరణను అధికార పార్టీ ప్రారంభించింది .
గ్రామం, వార్డుల్లో భిన్న రాజకీయ అభిప్రాయాలు కలిగిన కుటుంబాలు ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని వాలంటీర్లను ముందు పెట్టి స్టిక్కర్ల రాజకీయం వైసీపీ నడిపిస్తోంది. ప్రజలకు వాలంటీర్ల ముఖాలు సుపరిచితం. అందువల్ల పార్టీ కార్యకర్తతో పోల్చితే వాలంటీర్లకు గ్రామం, వార్డుల్లో చొరవ ఎక్కువ. భిన్న రాజకీయాలతో ఉండే కుటుంబాల్లోకి చొచ్చుకుని వెళ్లగలిగే అవకాశం వారికి ఉంటుంది. దీంతో వాలంటీర్ల సహకారంతో, గృహసారథుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా అమలు చేస్తోంది.
సచివాలయాల్లోకి వెళ్తుంటే వైసీపీ కార్యాలయానికి వెళ్తున్నట్లుందని ఇప్పటికే గ్రామాల్లో వినిపిస్తోన్న మాట . స్టిక్కర్ల కార్యక్రమం కూడా ప్రారంభమవ్వడంతో ఇళ్లు కూడా వైసీపీ రంగులు, జగన్ బొమ్మలతో నిండిపోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముందస్తు ఎన్నికలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లేది లేదని జగన్ చెబుతూ వస్తున్నారు . అయినా, స్టిక్కర్ల హడావుడితో ఏడాది ముందే ఎన్నికల వాతావరణాన్ని తీసుకొచ్చేస్తోంది అధికారపక్షం. ఒక్క గుమ్మాలకే కాదు సంక్షేమ పథకాల లబ్ధిదారుల సెల్ ఫోన్లకు కూడా వైసీపీ స్టిక్కర్లు అంటించేస్తున్నారు .
మా నమ్మకం జగన్… అంటూ స్టిక్కర్లు అంటించే కార్యక్రమాన్ని చేపట్టిన వైసీపీకి జనసేన, టిడిపిలు ధీటుగా సమాధానం ఇచ్చే పనిలో పడ్డాయి . జనసేన మొదలుపెట్టిన స్టిక్కర్ కార్యక్రమం చర్చానీయాంశం అయ్యింది. ఇప్పుడు టీడీపీ నేతలు కూడా అదే బాట పట్టారు . దీంతో ఆంధ్రప్రదేశ్ లో స్టిక్కర్స్ వార్ ముక్కలాటగా మారి ఇళ్ల గోడలు మూడు పార్టీల స్టిక్కర్లతో నిండిపోతున్నాయి.
సంక్షేమ పాలన ఇస్తున్నామని… మళ్లీ గెలిపించాలన్న లక్ష్యంతో వైసీపీ ఇంటింటికీ స్టిక్కర్లు వేస్తోంది . ఏం మాట్లాడాలి.. స్టిక్కర్లు ఎలా ఎక్కడ వేయ్యాలనే దానిపై ఏకంగా వందలాది మందికి ట్రైనింగ్ ఇచ్చి మరీ వైసీపీ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఇందులో ఇంటింటికీ ఎమ్మెల్యేలు కూడా తిరుగుతున్నారు. వైసీపీకి పోటీగా తిరుపతిలో ఇప్పటికే జనసేన స్టిక్కర్లు వేస్తోంది. మా నమ్మకం పవన్ అంటూ జనసైనికులు స్టిక్కర్లు అంటిస్తున్నారు
అటు జనసేన ఈ యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టిందో లేదో.. దాన్నే టీడీపీ కూడా అందిపుచ్చుకుంది . కృష్ణా జిల్లాలో కేశినేని చిన్ని ఆధ్వర్యంలో ఈ స్టిక్కర్లు అంటించుకుంటూ వెళ్తున్నారు. నిత్యావసరాల వస్తువుల ధరలు తగ్గాలంటే, విద్యుత్ చార్జీలు తగ్గాలంటే, ఆర్టీసీ చార్జీలు తగ్గాలంటే, చెత్తమీద పన్ను పోవాలంటే, అన్న క్యాంటీన్లు మళ్లీ తెరవాలంటే, చంద్రన్న బీమా రావాలంటే, జాబులు రావాలంటే.. సైకో పోవాలి.. సైకిల్ రావాలి.. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అంటూ స్టిక్కర్ల ప్రచారం మొదలుపెట్టారు . మొత్తానికి ఈ స్టిక్కర్ల రాజకీయం రాష్ట్రంలో రంజుగా సాగుతోంది.