Balakrishna : హిందూపురం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నందమూరి బాలకృష్ణ పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడోగానీ కనిపించరు. అప్పుడప్పుడూ తన నియోజకవర్గంలో పర్యటనలు చేస్తారు. మహానాడు లాంటి పెద్ద వేడుకలకు మాత్రమే బాలయ్య హాజరవుతూ ఉంటారు. నటసింహం ఏదైనా కార్యక్రమానికి వచ్చారంటే ఇక సందడి వాతావరణమే నెలకొంటుంది. తాజాగా బాలయ్య.. తన అల్లుడు నారా లోకేశ్ పాదయాత్రలో సందడి చేశారు.
అనంతపురం జిల్లా శింగనమలలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సాగుతోంది. మార్తాడులోని క్యాంప్ సైట్ నుంచి లోకేశ్తో కలిసి బాలయ్య నడిచారు. అల్లుడు పాదయాత్రలో మామ మెరవడంతో టీడీపీ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది. లోకేశ్ పాదయాత్ర యువతరానికి స్ఫూర్తి అని బాలకృష్ణ అన్నారు. సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న లోకేశ్కు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.
జగన్ సీఎం అయ్యాక ఏపీలో అభివృద్ధి కుంటుపడిందని బాలయ్య విమర్శించారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు కాలేదన్నారు. కానీ ల్యాండ్, శాండ్ మాఫియా రెచ్చిపోతోందని ఆరోపించారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తూ కేసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పేదవాళ్లు బతికే పరిస్థితి లేదన్నారు. ఏపీ సర్వనాశనమైందని విమర్శించారు. అభివృద్ధి శూన్యం, దోపిడీ ఘనం అన్నట్లుగా జగన్ పాలన సాగుతోందని బాలయ్య ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
వైసీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉందని బాలకృష్ణ అన్నారు. చాలా మంది నేతల టీడీపీతో టచ్లో ఉన్నారని వెల్లడించారు. వైసీపీ అరాచకాలను అంతమొందించేందుకు ప్రజలంతా ముందుకు రావాలని బాలయ్య పిలుపునిచ్చారు.
గంజాయి వద్దు బ్రో అంటూ రాసి ఉన్న క్యాప్, టీ షర్టులను లోకేశ్, బాలకృష్ణ పాదయాత్రలో ధరించారు. యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని సందేశమిచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే గంజాయి వాడకం పెరిగిపోయిందంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు.