Bandi Sanjay News (Telangana BJP) : టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసులో ఏ1గా ఉన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. రివర్స్ గేమ్ మొదలుపెట్టారు. వరంగల్ సీపీపై న్యాయపోరాటానికి రెడీ అయ్యారు. ఆయనపై కోర్టులో పరువునష్టం దావా వేసేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే తన హక్కులకు భంగం కలిగించారంటూ పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు. సీపీ రంగనాథ్ ను అంత తేలిగ్గా విడిచిపెట్టబోమన్న బండి… ప్రత్యక్ష యుద్ధానికి రెడీ అయిపోయారు. ఇప్పటికే రిపోర్టు రెడీ చేసినట్లు సమాచారం. వరంగల్ సీపీపై ఉన్న ఆరోపణలను కూడా వెలికి తీయాలనే యోచనలో ఉన్నారు బీజేపీ నేతలు.
టెన్త్ పేపర్ లీక్ కు బండి సంజయ్ కుట్ర చేశారంటూ తొలుత వరంగల్ సీపీ రంగనాథ్ ప్రెస్మీట్లో చెప్పడం సంచలనంగా మారింది. ఈ కేసులో ఏ1 నిందితుడు బండి సంజయ్ అంటూ తేల్చేశారాయన. బండి డైరెక్షన్ లోనే ఈ వ్యవహారం జరిగిందన్నారు. దీంతో తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ.. బండి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
ఎట్టిపరిస్థితుల్లో వరంగల్ సీపీ రంగనాథ్ను విడిచిపెట్టనంటూ బండి సంజయ్ హెచ్చరించారు. ఆయన ఆస్తుల చిట్టా బయటకు తీస్తామన్నారు. వరంగల్, నల్లగొండ ఎస్పీగా ఉన్న సమయంలో ఏం చేశారో తెలుసన్నారు. దళిత యువకుడు సత్యంబాబు కేసులో రంగనాథ్ పాత్ర ఏంటో కూడా బయటపెడతామన్నారు.
టెన్త్ పేపర్ లీక్ కేసులో సోమవారం విచారణకు రావాలని కమలాపురం పోలీసులు నోటీసులు ఇచ్చారు. కానీ విచారణకు రాలేనంటూ రిప్లై ఇచ్చారు బండి. తన ఫోన్ను ఎక్కడుందో తేల్చే వరకు… విచారణకు పిలువొద్దంటూ పోలీసులకు సూచించారు. దీనిపై పోలీసులు ఎలా ముందుకు వెళ్తారన్నది ఆసక్తిగా మారింది. అసలు తన ఫోన్తో సీపీకి ఏం సంబంధమంటూ ప్రశ్నిస్తున్నారు బండి సంజయ్. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన జడ్జిమెంట్ను గుర్తు చేశారు.
గతంలో కరీంనగర్ సీపీగా ఉన్న సత్యనారాయణ విషయంలోనూ పర్సనల్గా తీసుకున్నారు బండి సంజయ్. ఆయన్ను పార్లమెంట్కు విచారణ కోసం పిలిపించారు. మరి ఇప్పుడు ఈ వ్యవహారంపై వరంగల్ సీపీ రంగనాథ్ ఎలా స్పందిస్తారో చూడాలి.