Revanth Reddy Press Meet: తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ మోడల్ దేశానికే ప్రమాదకరమని హెచ్చరించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ను అస్థిరపరిచే కుట్ర మొదలు పెట్టారని ఆరోపించారు. జేడీఎస్ నేత కుమారస్వామికి కేసీఆర్ వందల కోట్లు ఎన్నికల ఫండ్ ఇస్తున్నారని తెలిపారు. అక్రమ సొమ్ముతో దేశ రాజకీయాలను కేసీఆర్ శాసించాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఏపీ ఎన్నికలకు కేసీఆర్ వందల కోట్లు ఖర్చు పెట్టారని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
కేసీఆర్ తనతో ఉన్న వాళ్లకు భూములు పంచుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. భూములను వనరులుగా పెట్టుకుని డబ్బు సంపాదిస్తున్నారని అన్నారు. హెటిరో పార్ధసారథి.. కేసీఆర్ సహచరుడు తెలిపారు. సీబీఐ, ఈడీ కేసులను పార్ధసారథి రెడ్డి ఎదుర్కొంటున్న విషయాన్ని ప్రస్తావించారు. కోవిడ్ సమయంలో రూ.3500 ఇంజెక్షన్ రూ. 35 వేలకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఐటీ సోదాల్లో రూ. 142 కోట్ల నగదుతో దొరికిపోయారని చెప్పారు. పార్ధసారథి పేదలకు సేవ చేస్తానంటే కేసీఆర్ నమ్మారా? అని రేవంత్ నిలదీశారు.
కేసీఆర్ భూబాగోతాలను ఒక్కొక్కటి బయటపెడతానని రేవంత్ ప్రకటించారు. మంగళవారం యశోద ఆస్పత్రికి ఇచ్చిన భూముల వ్యవహారం బయటపెడతానని చెప్పారు. కేసీఆర్ వద్ద లక్షల కోట్ల దొంగ సొమ్ము ఉందని ఆరోపించారు. హైటెక్ సిటీ వద్ద తన అనుచరుడికి 60 ఏళ్లపాటు లీజుకు 15 ఎకరాలను రాసిచ్చారని ఆరోపించారు. అధికారుల ఆదేశాలు కాదని కేసీఆర్ భూమిని కట్టబెట్టారన్నారు. ఇంత అన్యాయం ఉంటుందా? అని ప్రశ్నించారు.
ఏ ఎన్నికల వచ్చినా కేసీఆర్ వందల కోట్లు ఖర్చు పెడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గతంలో కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఎంత? ఇప్పుడు ఎంత? అని నిలదీశారు. ఈ విషయంపై దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాస్తాను. కేసీఆర్ అవినీతిని వివరిస్తానని తెలిపారు. సీబీఐకి కూడా లేఖ రాస్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
TSPSC పేపర్ లీకు కేసుపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నుంచి జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేయడంపై స్పందించారు. ఆ ఇద్దరు నేతలు తనకు మిత్రులేనని చెప్పారు. బీఆర్ఎస్ లో మోసపోయిన నేతలకు తమ సానుభూతి ఉంటుందన్నారు.