Bandi Sanjay News (BJP Telangana) : పదో హిందీ పేపర్ లీకు కేసులో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ పెను సంచలన రేపింది. బెయిల్ పై బయటకొచ్చిన సంజయ్.. ఇప్పుడు పోలీసులకు ట్విస్ట్ ఇచ్చారు. తన ఫోన్ పోయిందని కరీంనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం బయటకు వచ్చిన వ్యవహారంలో ఈ నెల 5న సంజయ్ అరెస్టు సమయంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో తన ఫోన్ పడిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మెయిల్ ద్వారా కరీంనగర్ టూ టౌన్ పోలీసులకు బండి సంజయ్ ఫిర్యాదు పంపారు.
హిందీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ చుట్టూ కేసు నడుస్తోంది. ఇటీవల వరంగల్ సీపీ రంగనాథ్ సంజయ్ ఫోన్ గురించి మాట్లాడారు. బండి సంజయ్ను ఫోన్ గురించి అడిగితే లేదన్నారని వెల్లడించారు. ఎక్కడుందంటే తెలియదంటున్నారని సీపీ చెప్పారు. ఫోన్ ఇస్తే కీలక సమాచారం బయటకు వస్తుందని బండి సంజయ్ కు తెలుసని అందుకే ఫోన్ ఇవ్వట్లేదని ఆరోపించారు. అయినా సరే ఆ ఫోన్ కాల్ డేటా సేకరిస్తామని స్పష్టం చేశారు.
పేపర్ షేర్ అయిన అందరికీ ప్రశాంత్ ఫోన్ చేయలేదన్నారు. పిల్లల సాయంతో ప్రశ్నపత్రం బయటకు తెచ్చుకున్నారని వివరించారు. కొన్ని ఫోన్లలో మెసేజ్లు డిలీట్ చేశారని పేర్కొన్నారు. వాటిని రిట్రైవ్ చేయాలన్నారు. కాల్ డేటా సేకరించాల్సి ఉందన్నారు. ఎలాంటి కుట్ర చేయకపోతే బండి సంజయ్ ఫోన్ ఇవ్వొచ్చు కదా? అని ఇటీవల వరంగల్ సీపీ రంగనాథ్ ప్రశ్నించారు.
పోలీసులు బండి సంజయ్ ఫోన్ లోనే కీలక విషయాలున్నాయని ఆరోపించారు. ఇప్పడు ఆ ఫోనే పోయిందని బండి సంజయ్ ఫిర్యాదు చేయడం ఆసక్తిగా మారింది. ఆ ఫోన్ మిస్సైందా..? మిస్ చేశారా..?