Bandi Sanjay : హైదరాబాద్ లో మోదీ పర్యటన తర్వాత బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రధాని మోదీ స్పీచ్ ను గులాబీ నేతలు తప్పుపట్టారు. తెలంగాణ ప్రభుత్వంపై చేసిన విమర్శలను తిప్పికొట్టారు. ఇటు బీజేపీ నేతలు కేసీఆర్ ను టార్గెట్ చేశారు. ప్రధాని పర్యటనలో సీఎం కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు.
కొంతకాలంగా తెలంగాణలో ప్రధాని మోదీ కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొనడంలేదు. మంత్రులే ప్రధానికి స్వాగతం చెప్పేందుకు వెళుతున్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సావానికి కేసీఆర్ వెళ్లలేదు. తాజాగా మోదీ పర్యటన షెడ్యూల్ ప్రకటించగానే కేసీఆర్ హాజరుకారని ముందే స్పష్టత వచ్చింది. సభ ప్రాంగంణంలో ప్రోటోకాల్ ప్రకారం కేసీఆర్ కోసం కుర్చీ కూడా ఏర్పాటు చేశారు. అయితే గులాబీ బాస్ మరోసారి మోదీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇష్టపడలేదు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీఆర్ తీరును బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు.
ప్రధానమంత్రి మోదీ సభకు కేసీఆర్ ఎందుకు రాలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. నేటి సీఎం షెడ్యూల్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ వస్తారని ఎదురుచూశానన్నారు. వస్తే సన్మానించేందుకు శాలువ కూడా తీసుకువచ్చానని చెప్పారు.
తెలంగాణలో రూ. 11 వేల కోట్లతో అభివృద్ధి పనులు ప్రధాని మోదీ చేపట్టారని బండి సంజయ్ తెలిపారు. కేంద్రం అభివృద్ధికి సహకరించడం లేదని నిత్యం ఆరోపించే కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలని నిలదీశారు. రాష్ట్ర అభివృద్ధిని కేసీఆర్ కోరుకోవడం లేదన్నారు. దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తే కేసీఆర్ ఎందుకు రాలేదన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కానీ రాష్ట్ర సర్కార్ సహకరించడం లేదని బండి ఎదురుదాడికి దిగారు.