PM Modi: కాంగ్రెస్ పరివార్ పార్టీ. బీఆర్ఎస్ కుటుంబ పార్టీ. బీజేపీ పదే పదే చేసే విమర్శలు ఇవి. పారివార్ పార్టీ అని పేరు పెట్టిందే కమలనాథులు. రాహుల్ విషయం వచ్చినప్పుడల్లా.. కాంగ్రెస్ను ఇదే పేరుతో విమర్శిస్తుంటారు. ఇక బీజేపీ బడా నేతలు తెలంగాణకు వచ్చినప్పుడల్లా.. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని.. వారి నుంచి ప్రజలకు విముక్తి లభించాలని మండిపడుతుంటారు.
బీజేపీ విమర్శలకు కాంగ్రెస్, బీఆర్ఎస్లు సైతం బాగానే కౌంటర్లు ఇస్తుంటాయి. మోదీది అంబానీ, అదానీల పార్టీ అంటూ రాహుల్ తరుచూ ఎద్దేవా చేస్తుంటారు. ఇక బీఆర్ఎస్ స్టైల్ మరోలా ఉంటుంది. మోదీ, అమిత్షా, నడ్డా లాంటి వాళ్లు రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా వారికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలతో కలకలం రేపుతుంటారు. కేంద్రం తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని.. తమ నిధులే కేంద్రం తీసుకుంటోందని ఫ్లెక్సీలతో హోరెత్తిస్తుంటారు. అయితే, ఆ ఫ్లెక్సీలపై ఎక్కడా బీఆర్ఎస్ పేరు మాత్రం ఉండదు. కానీ, అవి ఏర్పాటు చేసింది గులాబీ పార్టీనే అనే విషయం మాత్రం ఓపెన్ సీక్రెట్.
తాజాగా, వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవానికి సికింద్రాబాద్ వస్తున్నారు ప్రధాని మోదీ. పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించనున్నారు. ఈసారి కూడా నగరంలో ఫ్లెక్సీల వార్ మొదలైంది. ‘పరివార్ వెల్కమ్స్ యూ మోడీజీ’ అనే టైటిల్లో పలుచోట్లు ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి. బీజేపీకి చెందిన నేతలు, వారి వారసుల ఫోటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లో అమిత్ షా, ఆయన కొడుకు జై షా నుంచి పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఫోటోలతో కూడిన భారీ ఫ్లెక్సీలు బీజేపీని ప్రశ్నిస్తున్నాయి. మరి, ఈ ఫ్లెక్సీలు కూడా పెట్టింది వాళ్లేగా? డౌటా?