BJP News Telangana : బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మలరామారం పీఎస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పీఎస్కు బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలించారు. దీంతో పీఎస్ ఎదుట పోలీసులు భారీగా మోహరించారు. అయినా సరే బీజేపీ శ్రేణులు స్టేషన్ లోపలకు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పీఎస్ ఎదుట కర్రలు వేసి బీజేపీ కార్యకర్తలు దగ్ధం చేశారు.దీంతో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు.. బండి సంజయ్ను కలిసేందుకు బొమ్మల రామారం పీఎస్ వెళ్లారు. అడ్డుకోవడంతో రఘునందన్ రావుకు, పోలీసులు మధ్య వాగ్వాదం జరిగింది. ఈక్రమంలో రఘునందన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బండి సంజయ్ను ఏ కేసులో.. ఎందుకు అరెస్ట్ చేశారో పోలీసులు చెప్పడం లేదని రఘునందన్ మండిపడ్డారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదని.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు పాటించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ పై ఆ పార్టీ నేతలు తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బండి సంజయ్ ను అక్రమంగా అరెస్ట్ చేసిందని పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రజల పక్షాన పోరాడుతున్నందునే ఆయనపై కేసీఆర్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగిందని బీజేపీ నేతలు ఆరోపించారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ బండి సంజయ్ లోక్ సభ స్పీకర్ కు లేఖ రాశారు.
వరంగల్ లో టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బండి సంజయ్ కు అత్యంత సన్నిహితుడని బీఆర్ఎస్ ఆరోపించింది. మంగళవారం రాత్రి కరీంనగర్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
పోలీసులు అకస్మాత్తుగా ఇంటిపై దాడి చేసి తన భర్త బండి సంజయ్ ను అరెస్ట్ చేయడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యానని ఆయన సతీమణి అపర్ణ తెలిపారు. బండి సంజయ్ హైదరాబాద్ నుంచి ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే పోలీసులు వచ్చారని వెల్లడించారు. తన మాతృమూర్తితో బండి సంజయ్కుకు ఎంతో అనుబంధం ఉందని.. చిన్న కర్మకు హాజరయ్యేందుకు వచ్చారని చెప్పారు. ఎంపీ అని చూడకుండా కాలర్ పట్టుకుని లాక్కెళ్లారని ఆమె మండిపడ్డారు. కనీసం ఎక్కడికి తీసుకెళ్తున్నారో సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు.