Bandi Sanjay : కరీంనగర్ లో అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ను పోలీసులు అరెస్టు చేశారు. సీఆర్పీసీ 151 కింద నోటీసులు ఇచ్చి బలవంతంగా అదుపులోకి తీసుకుని యాదాద్రి జిల్లాలోని బొమ్మలరామారం పోలీస్ స్టేషన్కు తరలించారు. సంజయ్ అత్త ఇటీవల చనిపోయారు. 9 రోజుల కార్యక్రమం బుధవారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ లోని జ్యోతినగర్లోని వారి ఇంటికి సంజయ్ వచ్చారు.
ఈ సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు అర్ధరాత్రి 12.45 గంటల సమయంలో కరీంనగర్ ఏసీపీ తుల శ్రీనివాస్రావు ఆధ్వర్యంలో అక్కడకి వెళ్లారు. సంజయ్ను ఠాణాకు రావాల్సిందిగా ఏసీపీ కోరారు. ఎందుకు రావాలి? ఏ కేసులో తనను తీసుకెళ్తున్నారని సంజయ్ ప్రశ్నించారు. అయితే తమకు అరెస్టు చేసే అధికారం ఉందని.. స్టేషన్కు వెళ్లాక విషయం చెబుతామంటూ పోలీసులు బలవంతంగా సంజయ్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, సంజయ్కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆయన ప్రతిఘటించినా పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారు.
బండి సంజయ్ అరెస్ట్ సమాచారం తెలియగానే బీజేపీ పట్టణ నాయకులు భారీగా తరలివచ్చారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమ నేతను అరెస్టు చేయవద్దని నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య జరిగిన తోపులాట జరిగింది. అయినా సరే సంజయ్ను బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించి తీసుకెళ్లారు.
పోలీసులు సంజయ్ను ఎందుకు అరెస్ట్ చేశారనే విషయమై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. గతంలో గ్రూప్-1 ప్రశ్నపత్రాల లీకేజీ విషయంలో సంజయ్ ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. వాటికి సంబంధించి సిట్ రెండుసార్లు నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరుకాకుండా సంజయ్ తన లీగల్ టీమ్ను పంపించారు. మరోవైపు పదోతరగతి ప్రశ్నపత్రం లీకేజీ విషయంలో ఎంపీని అరెస్టు చేశారనే ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రెస్మీట్ పెడతారనే సమాచారంతోనే తమ నేతను అరెస్టు చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.