BRS: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ తో రాష్ట్రంలో మరోసారి పొలిటికల్ వాతావరణం వేడెక్కింది. సంజయ్ అరెస్ట్ను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి జగదీష్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. టెన్త్ పేపర్ లీకేజీ వెనుక బండి సంజయ్ పాత్ర ఉందని ఆరోపించారు.
కుట్రలో భాగంగానే బీజేపీ పరీక్ష పేపర్లు లీకులు చేస్తోందని మంత్రి విమర్శించారు. రాజకీయ క్రీడ కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. అధికారం కోసం బీజేపీ ఎలాంటి దారుణానికైనా పాల్పడుతుందన్నారు. తప్పు చేసిన వాళ్లు ఎక్కడో ఒకచోట దొరికిపోతారని తెలిపారు. బండి సంజయ్కు చదువు విలువ తెలియదని.. ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికే బీజేపీ కుట్రలు చేస్తోందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. పోలీసులు అన్ని విషయాలు బయటపెడతారని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పరీక్షల లీకేజీ వ్యవహారంలో బీజేపీ కుట్ర ఉందంటూ…. తాము వ్యక్తం చేసిన అనుమానాలు నిజం అయ్యాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. కమలాపూర్ లో బీజేపీ కార్యకర్త ప్రోద్భలంతోనే పదో తరగతి హిందీ పేపర్ బయటకు వచ్చిందన్నారు. బీజేపీ కార్యకర్త ప్రశాంత్ బయటకు తెచ్చిన ప్రశ్నా పత్రాన్ని బండి సంజయ్ కు వాట్సాప్ ద్వారా పంపించారని ఆరోపించారు. తనకొచ్చిన సమాచారాన్ని బండి సంజయ్ పోలీసులకు ఇవ్వక పోవడం నేరమేనని తెలిపారు. బండి సంజయ్ పై లోక్ సభ స్పీకర్ అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు వరంగల్ లో టెన్త్ పేపర్ లీక్ కేసులో నిందితుడు ప్రశాంత్….ఏ పార్టీ కార్యకర్త? అనే అంశంపై చర్చ నడుస్తోంది. ఈ వివాదంపై సోషల్ మీడియాలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ నడుస్తోంది. ప్రశాంత్… బండి సంజయ్, లక్ష్మణ్, దత్తాత్రేయతో కలిసి దిగిన ఫోటోలు వైరల్ గా మారాయి. మరోవైపు బీజేపీ కౌంటరిచ్చింది. నిందితుడు ప్రశాంత్…. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తో ఉన్న ఫోటోలు రిలీజ్ చేసింది.