Bandi Sanjay : తెలంగాణలో TSPSC పరీక్ష పేపర్లు లీకుల వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ప్రభుత్వంపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ఈ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఈ ఇద్దరు నేతలకు కేటీఆర్ లీగర్ నోటీసులు ఇచ్చారు. బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కోరారు. లేదంటే రూ. 100 కోట్ల పరువు నష్టం దావా ఎదుర్కొవాలని హెచ్చరించారు. మరోవైపు TSPSC పేపర్ల లీకుల కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ రేవంత్ కు, బండి సంజయ్ కు నోటీసులు ఇచ్చింది. దీంతో రేవంత్ సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసు ఇలా నడుస్తుండగానే తెలంగాణలో టెన్త్ పేపర్ల లీకులు కలకలం రేపుతున్నాయి.
తొలిరోజు తెలుగు ప్రశ్నాపత్రం పరీక్ష ప్రారంభమైన 7 నిమిషాలకే వాట్సాప్ లో చక్కర్లు కొట్టింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే నలుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. రెండో రోజు హిందీ ప్రశ్నాపత్రం బయటకు రావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పదో తరగతి హిందీ పేపరు కూడా లీక్ కావడం సిగ్గుచేటన్నారు. మరోసారి మంత్రి కేటీఆర్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. కేటీఆర్ ను కేబినెట్ నుంచి తొలిగించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ప్రధాని హైదరాబాద్ పర్యటన వేళ బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మోదీ చదువుపై పనిలేని వాళ్లే అనవసర చర్చ పెడుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. చదువుకు పదవులకు సంబంధంలేదని స్పష్టం చేశారు. ఈ నెల 8న ప్రధాని మోదీ హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పరేడ్ మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభ ప్రాంగణాన్ని సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ పరిశీలించారు.