Ambani (NMACC Event): ముకేశ్ అంబానీ. పరిచయం అక్కరలేని పేరు. ఇండియాలోకే రిచెస్ట్. మరి, అలాంటి అంబానీ ఫ్యామిలీ పార్టీ ఇస్తే ఎట్టా ఉంటుందో తెలుసా? విందులో ఎలాంటి వంటకాలు వడ్డించారో తెలుసా? పార్టీలో కరెన్సీ నోట్ల విందు ఇచ్చారని తెలుసా?
అవును, నిజమే. అంబానీ ఇచ్చిన పార్టీ అదిరిపోయింది. అందులోనూ ముకేశ్ సతీమణి నీతా అంబానీకి సంబంధించిన ప్రోగ్రామ్ కావడంతో మరింత గ్రాండ్ సెలబ్రేషన్స్. వారి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘నీతా ముకేశ్ అంబానీ సాంస్కృతిక కేంద్రం (NMACC)’ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. ఈవెంట్ ముగిశాక.. ఆహుతులందరికీ గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఆ పార్టీ గురించి మూడు రోజులుగా చర్చ జరుగుతోందంటే మాటలా.
అంబానీ పార్టీ ఇచ్చారంటే.. మటన్, చికెన్, ఫిష్, ప్రాన్స్, పీతలు, నత్తలు.. మందు, చిందు ఇలా ఉంటుందని అనుకునేరు. అస్సలు కాదు. అంబానీ కుటుంబం ప్యూర్ వెజిటేరియన్. మాంసం ముట్టరు. సో, పార్టీలోనూ నో నాన్వెజ్ ఐటమ్స్.
వెజ్లోనే అనేక వెరైటీలు వడ్డించారు. పె..ద్ద వెండి పళ్లెంలో భోజనం. వెండి గిన్నెల్లో వంటకాలు. వెజ్ బిర్యానీ, పాలక్ పన్నీర్, పప్పు, రోటీ, ఉత్తరాది వంటకాలు, పలురకాల స్వీట్లు, పండ్లు.. ఇలా వెండి పళ్లెం నిండా నోరూరించే వంటకాలే.
వీటన్నిటికంటే ఓ స్పెషల్ ఐటమ్ తెగ వైరల్ అవుతోంది. నెట్టింట్ల వాటి ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. అదో స్పెషల్ స్వీట్. దాని పేరు ‘దౌలత్ కి చాట్’.
దౌలత్ అంటే ఆస్తి/సంపద. పేరుకు తగ్గట్టే 500 రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించి మరీ ఆ స్వీట్ను వడ్డించారు. మట్టి పాత్రలో ఆకు పరిచి.. అందులో స్వీట్ పేర్చి.. 500 నోట్లతో డెకరేట్ చేసి అతిథులకు అందించారు. అందుకే, ఆ ఫోటోలు అంతగా వైరల్ అవుతున్నాయి.
‘దౌలత్ కి చాట్’. ఢిల్లీలో చాలా ఫేమస్. కేవలం వింటర్లో మాత్రమే అమ్ముతారు. చిక్కటి పాల నుంచి తీసిన నురుగుతో చేస్తారు. పిస్తా, కోవా, చక్కెరతో తయారుచేస్తారు. దీని తయారీకి ఖరీదైన, నాణ్యమైన పదార్థాలు వాడుతారు కాబట్టి.. దీన్ని ‘దౌలత్ కి చాట్’ అని అంటారు. ఢిల్లీలోని ‘ఇండియన్ అసెంట్’ అనే రెస్టారంట్.. ఈ స్వీట్ను నకిలీ కరెన్సీ నోట్లతో అలంకరించి అమ్ముతుంటుంది. అందువల్ల అది మరింత పాపులర్ అయింది. అ ప్రత్యేక వంటకాన్నే అంబానీ పార్టీలో సైతం ఆహుతులకు వడ్డించారు. రెస్టారెంట్ మాదిరే ఫేక్ కరెన్సీ నోట్లతో డెకరేట్ చేసి అందించారు. సో, ఫోటోలో ఉన్న ఆ నోట్లు.. వర్జినల్ కావు నకిలీ నోట్లు.