Secunderabad Fire Accident : సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాదం ఆరుగురి ఊపిరి తీసింది. ఆ భవనంలో ఉన్న కాల్ సెంటర్ లో పని చేస్తున్న నలుగురు యువతులు, ఇద్దరు యువకులు ప్రమాదంలో చిక్కుకుని బయటకు రాలేకపోయారు. చివరికి ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు స్వప్నలోక్ కాంప్లెక్స్లో రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు.
ప్రమాదం ఎలా జరిగిందంటే..?
ప్యారడైజ్ సమీపంలోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో గురువారం సాయంత్రం 6.30 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ భవనంలో మొత్తం 8 అంతస్తులున్నాయి. తొలుత ఏడో అంతస్తులో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. 5వ అంతస్తులో పేలుడు సంభవించడంతో మంటలు తీవ్రమయ్యాయి. తర్వాత 4వ అంతస్తు వరకు మంటలు వ్యాపించాయి. 5వ అంతస్తులో వస్త్ర దుకాణాలు, కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లు, కాల్ సెంటర్లు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు ఉన్నాయి. అగ్నిప్రమాదం సంభవించగానే అక్కడ పనిచేస్తున్న సిబ్బందితోపాటు, షాపింగ్కు వచ్చిన వారు వెంటనే కిందికి దిగిపోయారు. అయితే పెయింటింగ్ డబ్బాలు పేలడం, అగ్నికీలలు భారీగా ఎగసిపడటం, పొగ కమ్ముకోవడంతో కొందరు కిందికి రాలేకపోయారు.
ఆర్తనాదాలు..
అగ్నిప్రమాదం తర్వాత విద్యుత్తు సరఫరా నిలిపివేయడంతో తమ వద్ద ఉన్న సెల్ఫోన్ల లైట్లను కిందికి చూపిస్తూ కాపాడాలంటూ బాధితులు చాలాసేపు వేడుకున్నారు. దట్టమైన పొగలు వ్యాపించడం, గదిలో ఇరుక్కుపోవడంతో ఆక్సిజన్ అందక అక్కడ చిక్కుకున్న వారు అపస్మారక స్థితికి చేరుకున్నారు. అయితే అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు బాధితులను కాపాడేందుకు యత్నించాయి. హైడ్రాలిక్ క్రేన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది పైకి వెళ్లి అక్కడ చిక్కుకున్న వారిని కిందికి దించే ప్రయత్నం చేశారు. మరోవైపు మంటలు అదుపు చేసేందుకు పది అగ్నిమాపక యంత్రాలను రంగంలోకి దించారు. రాత్రి పది గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. ఎక్కువ మంది షాపుల వెనుక భాగంలోని బాత్రూం విండోల నుంచి తప్పించుకొని బయటపడ్డారు.
ఆగిన ఊపిరి..
దాదాపు 15 మందిని అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద భారీ క్రేన్ల సాయంతో కాపాడారు. అందులో అపస్మారక స్థితిలో ఉన్న ఆరుగురిని ఆసుపత్రులకు తరలించారు. గాంధీ ఆసుపత్రిలో ప్రమీల (22), వెన్నెల(22) ,శ్రావణి(22), త్రివేణి(22), శివ(22) మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అపోలో ఆసుపత్రిలో ప్రశాంత్ (23) కన్నుమూశాడు. వీరిలో వెన్నెల, శ్రావణి, శివ వరంగల్ జిల్లాకు చెందిన వారు, ప్రశాంత్ , ప్రమీల మహబూబాబాద్ జిల్లాకు చెందినవారు , త్రివేణిది ఖమ్మం జిల్లా నేలకొండపల్లిగా గుర్తించారు. వారంతా బీఎం 5 కార్యాలయం లో కాల్సెంటర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.
నిత్యం రద్దీ ప్రాంతం..
స్వప్నలోక్ కాంప్లెక్స్ రెండు బ్లాకుల్లో.. 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో దాదాపు 400 షాపులు ఉన్నాయి. ఈ కాంప్లెక్స్లో సుమారు 3 వేల మంది పనిచేస్తుంటారు. సెల్లార్, గ్రౌండ్, మొదటి అంతస్తుల్లో 170 షాపులు ఉన్నాయి. అగ్నిప్రమాదం సంభవించే సమయానికి 5 నుంచి 7 అంతస్తుల్లో చాలా కార్యాలయాల నుంచి ఉద్యోగులు వెళ్లిపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. కాంప్లెక్స్లోని ఎ, బి బ్లాక్ల మధ్య దూరం ఉండటం వల్ల పెనుప్రమాదం తప్పింది.
Covid: వామ్మో.. మళ్లీ కరోనా!.. తెలంగాణకు కేంద్రం అలర్ట్..
Ghost Fish : రెయిన్బో కలర్స్ను ప్రతిబింబిస్తున్న చేప చర్మం..