NTR : విశ్వవేదికపై తెలుగు సినిమా RRR సత్తా చాటింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు కైవసం చేసుకుంది. ఈ వేడుకల్లో పాల్గొన్న RRR టీమ్ ఎంతో ఉత్సాహంగా ఉంది. ఎన్నో మధుర జ్ఞాపకాలతో తిరిగి భారత్ కు చేరుకుంది. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అనంతరం తాజాగా జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగానే యంగ్ టైగర్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు.
ఆస్కార్ వేడుక అనుభూతులను ఎన్టీఆర్ పంచుకున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన వెంటనే తొలుత తన భార్యకు ఫోన్ చేసి ఆనందాన్ని పంచుకున్నానని వెల్లడించారు. స్టేజ్పై కీరవాణి, చంద్రబోస్ అవార్డును తీసుకున్న ఆ క్షణాలను ఎప్పటికీ మరిచిపోనని భావోద్వేగంతో చెప్పారు. అదే తన బెస్ట్ మూమెంట్ అని NTR పేర్కొన్నారు.
మన దేశం మాదిరిగానే ఆ అవార్డు ఎంతో గొప్పగా ఉందని ఎన్టీఆర్ అన్నారు. అదొక అద్భుతమైన అనుభవంగా పేర్కొన్నారు. ఆ అనుభూతులను మాటల్లో వర్ణించలేనన్నారు. భారతీయుడిని, తెలుగువాడిని అయినందుకు గర్వపడుతున్నానని ఎన్టీఆర్ చెప్పారు. తాము ఇంత గౌరవాన్ని దక్కించుకోవడానికి కారణం అభిమానులు, సినీప్రేమికులేనని ఎన్టీఆర్ స్పష్టంచేశారు. వాళ్ల ప్రేమ, ఆశీస్సుల వల్లే ఈ అవార్డు సాధ్యమైందని చెప్పుకొచ్చారు.
Naatu Naatu: నాటు నాటుకు ఆస్కార్ అందుకే.. పాటలో పదును ఇదే
Dil Raju: దిల్ ‘రాజు’ రాజకీయ ‘బంటు’నా?.. ఆ హడావుడి అందుకేనా?