Lord Shiva:-శివుడు అభిషేక ప్రియుడు. కలశంతో మంచి నీటి అభిషేకం చేసిన పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. కోరిన కోర్కెలను నెరవేరుస్తాడు. అలా అని అభిషేకం ఎలా పడితే అలా చేయకూడదు. శివుడిని ఆరాధించేటప్పుడు ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. అప్పుడే పుణ్యఫలం దక్కుతుంది. తెలిసీతెలియక తప్పులు చేస్తే అభిషేకం చేసిన పుణ్యం కూడా దక్కదు.ఉత్తర దిశను శివుడి ప్రధాన ద్వారంగా భావిస్తారు. కాబట్టి శివ లింగానికి నీటిని అభిషేకించేటప్పుడు ఎల్లప్పుడూ ఉత్తరం వైపు ముఖం ఉంచాలి. ఈ దిశను అర్ధనారీశ్వరుడి ఎడమవైపుగా భావిస్తారు. ఈ వైపు పార్వతీదేవికి అంకితం చేయబడి ఉంటుంది. కాబట్టి ఈ వైపు నీటిని అభిషేకించడం ద్వారా పార్వతీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది.
పాలు లేదా నీళ్లతో శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు రాగి పాత్రను అస్సలు ఉపయోగించకూడదు. రాగితో అభిషేకం చేయడం విషంతో సమానంగా పరిగణిస్తారు. స్టీల్ గిన్నె లేదా మట్టి పాత్రల్లో తీసుకునే అభిషేకించాలి. మహాశివరాత్రి నాడు కొంతమంది పాల ప్యాకెట్లతో అభిషేకం చేస్తుంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. అలాగే కూర్చొని మాత్రమే అభిషేకం చేయాలి.
పూజా సమయంలో శివలింగంపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర వంటి పంచామృతాలతో అభిషేకం చేసినప్పటికీ.. చివరగా నీటితో అభిషేకం చేయడం చాలా ముఖ్యం. అప్పుడే అభిషేక ఫలితం దక్కుతుంది. నీటితో అభిషేకం చేసేటప్పుడు అందులో పూలు, గంధం వంటివి ఏవీ కలపకూడదు. స్వచ్ఛమైన నీటితోనే అభిషేకం చేయాలి. అలాగే శివుడికి శంఖంలో నీటిని తీసుకుని ఎప్పుడూ అభిషేకించకూడదు.