Spiritual Topics : గుడికి వెళ్లిన వాళ్లు తీర్థం తీసుకోకుండా వెనక్కి రారు. తీర్థం అంటే దేవుడి అభిషేక ద్రవ్యం, దానికి కొన్ని ఇతర పదార్థాలను జతచేసి భక్తులకు ఇస్తారు. శ్రీ మహావిష్ణువుని సాలగ్రామ శిలలకు రుద్ర నమక చమకాలతో మంత్రములతో స్నానం చేయించిన జలాన్ని పూజ పవిత్ర పాత్రలో ఉంచి స్నపనము చేసిన జలము కూడా కలిపి ఇస్తారు.
తీర్థం తీసుకునే విషయంలో మగవారికి, ఆడవారికే వేర్వేరు పద్ధతులు ఉంటాయి. మగవారు తన భుజంపై ఉన్న ఉత్తరీయం లేదా కండువాను, ఆడవారు తమ చీర లేదా చున్ని, పైట కొంగును ఎడమ చేతిలో నాలుగు మడతలు వచ్చే విధంగా వేసుకోవాలి. ఎడమ చేతిలో ఉన్న గుడ్డ మడతలో కుడి చేతిని ఎడమ చేతిలో వేసి చూపుడువేలు ఏమాత్రం తగలకుండా బ్రొటన వేలును నడిమి వేలి కింద కణుపునకు పెట్టి గట్టిగా నొక్కి పట్టి గోవింద నామాలను స్మరిస్తూ శబ్దం రాకుండా తీసుకోవాలి.
తీర్దం తాగిన తర్వాత కుడి చేతిని తలపై రాసుకోవద్దు. తలపైన బ్రహ్మదేవుడు ఉంటాడు. మన ఎంగి లిని బ్రహ్మకు అర్పణం చేసిన వారమవుతాం. తీర్థాన్ని మూడుసార్లు తీసుకోవాలి. మొదటిసారి తీసుకున్న తీర్థంతో శారీరక, మానసిక శుద్ధి జరుగుతుంది. రెండో సారి తీర్థం న్యాయ ధర్మ ప్రవర్తనలు చక్కబడతాయి. మూడో సారి పవిత్రమైన పరమేశ్వరని పరమ పదం అనుకుంటూ తీసుకోవాలి.
దేవునికి పూజ చేసిన తర్వాత తీసుకునే తీర్ధంలో పంచామృతాలు, తులసి దళాలు, సుగంధ ద్రవ్యాలు, మంత్ర శక్తులు ఉంటాయి. దీంతో ఆ తీర్ధం అత్యంత పవిత్రంగా మారుతుంది. మన పురాణాల ప్రకారం తీర్ధం అంటే తరింపజేసేది అని అర్ధం. తీర్ధాన్ని మూడుసార్లు తీసుకుంటే.. భోజనం చేసినంత శక్తి వస్తుందని అంటారు.
చేయకూడని పని
అయితే కొందరు జుర్రున శబ్దం చేసి తీసుకుంటారు.. మరికొందరు ఒకసారి మాత్రమే తీసుకుంటారు, ఇంకొందరు తీర్ధం త్రాగినప్పుడు శబ్దం చేస్తారు.. ఇలా మాత్రం చేయద్దు అంటున్నారు పండితులు, అలాగే తీర్దం ఎప్పుడూ పారబోయకూడదు.