Gannavaram : గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి తర్వాత విజయవాడలోనూ ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పటమటలోని ఎన్టీఆర్ సర్కిల్ కు రావాలని వంశీకి బుద్ధా వెంకన్న సవాల్ విసరడంతో రాజకీయం హీటెక్కింది. దమ్ముంటే గన్నవరం రావాలని బుద్ధా వెంకన్నకు వంశీ ప్రతిసవాల్ చేశారు. దీంతో విజయవాడ, గన్నవరంలో ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. అటు టీడీపీ కార్యకర్తలు, ఇటు వంశీ అనుచురులు రంగంలోకి దిగడంతో పరిస్థితి అదుపుతప్పుతోంది. ఏ క్షణాన ఎలాంటి ఘర్షణలు తలెత్తుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.
చలో గన్నవరం..
టీడీపీ కార్యాలయంపై దాడి తర్వాత గన్నవరంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. దాడిని నిరసిస్తూ టీడీపీ ‘చలో గన్నవరం’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి అనుమతిలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఎక్కడకక్కడ టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు తప్పవని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా హెచ్చరించారు. గన్నవరం టీడీపీ కార్యాలయం వద్ద దాడి ఘటనలో గన్నవరం సీఐ కనకరావు తలకు గాయమైందని ఎస్పీ చెప్పారు. టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే శాంతిభద్రతలకు విఘాతం కలిగిందన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి దృశ్యాలను పరిశీలిస్తున్నామని.. దీనిపై సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ చెప్పారు. గన్నవరం పీఎస్ పరిధిలో 144 సెక్షన్ విధించినట్లు వివరించారు. ముందస్తు అనుమతి లేకుండా సభలు, నిరసన కార్యక్రమాలు చేపట్టొద్దని హెచ్చరించారు.
పట్టాభి ఎక్కడ..?
గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వంశీ అనుచరులు చేసిన దాడి నేపథ్యంలో.. స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. దాడి జరిగిన విషయం తెలుసుకొని గన్నవరం వెళ్లిన టీడీపీ నేత పట్టాభిరామ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పట్టాభి కనిపించకపోవడంపై ఆయన భార్య ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన భర్తను ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనకు ఏం జరిగినా సీఎం జగన్, డీజీపీదే బాధ్యత అని పట్టాభి భార్య అన్నారు.
మరోవైపు విజయవాడలోని పట్టాభి ఇంటికి పోలీసులు వచ్చారు. గన్నవరం కోర్టుకు ఆయన్ను తీసుకొస్తామని పట్టాభి సతీమణి చందనకి చెప్పారు. పట్టాభితో వీడియో కాల్ మాట్లాడించాలని ఆమె కోరగా.. అందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో డీజీపీని కలిసేందుకు బైక్ పై చందన బయల్దేరగా పోలీసులు అడ్డుకుని తిరిగి ఇంటికి తీసుకెళ్లారు.
Crime: వ్యభిచార దందాలో ఎస్ఐ తల్లి, తమ్ముడు.. ఏపీలో కలకలం
Governor : బిశ్వభూషణ్ కు ఏపీలో వీడ్కోలు.. గవర్నర్ వ్యవస్థకు నిండుదనం తెచ్చారు: సీఎం జగన్