Governor : గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు ఏపీ ప్రభుత్వం వీడ్కోలు పలికింది. విజయవాడ ఎ కన్వెన్షన్ సెంటర్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గవర్నర్ వ్యవస్థకు నిండుతనం తెచ్చిన వ్యక్తి బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనియాడారు. రాజ్యాంగ వ్యవస్థలో సమన్వయాన్ని ఆచరణలో చూపారని ప్రశంసించారు.
తండ్రిలా, పెద్దలా రాష్ట్ర ప్రజల అభివృద్ధికి అండగా నిలిచారని బిశ్వభూషణ్ తో తనకున్న అనుబంధాన్ని సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. గవర్నర్తో తనకున్న తీపి జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేనన్నారు. గవర్నర్ విద్యావేత్త, న్యాయ నిపుణులు, స్వాతంత్ర్య సమరయోధులని గుర్తు చేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, ఒడిశా బార్ అసోసియేషన్లో కీలకపాత్ర పోషించారని తెలిపారు. గవర్నర్ నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. బిశ్వభూషణ్ హరిచందన్కు ప్రజలు, ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలిపారు.
సీఎం జగన్తో తనకున్న అనుభవాలను గవర్నర్ పంచుకున్నారు. జగన్ చూపిన గౌరవం, ఆప్యాయత మరువలేనివన్నారు. గవర్నర్, సీఎం సంబంధాలు ఎంతో ముఖ్యమైనవని వివరించారు. సీఎం జగన్ పేదలకు సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని కొనియాడారు. ఇన్ని సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారని ప్రారంభంలో అడిగానని గుర్తు చేసుకున్నారు. దేవుడి దయతో అన్నీ పూర్తవుతాయని సీఎం జగన్ చెప్పారని.. రైతు భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని గవర్నర్ అన్నారు. వ్యవసాయ రంగంలో ఏపీ ముందుందని తెలిపారు. కరోనా సమయంలో ఏపీలోని వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు ప్రాణాలకు తెగించి సేవలు అందించారని ప్రశంసించారు. సీఎం జగన్ను తన కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నానని గవర్నర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తనకు రెండో ఇల్లు లాంటిదని పేర్కొన్నారు.
ఏపీ గవర్నర్గా మూడున్నర సంవత్సరాలపాటు బిశ్వభూషణ్ హరిచందన్ సేవలు అందించారు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ గవర్నర్గా బదీలయ్యారు. ఈ నేపథ్యంలో గవర్నర్ కు ఏపీ ప్రభుత్వం వీడ్కోలు సభ నిర్వహించింది.
Gannavaram : గన్నవరంలో 144 సెక్షన్.. విజయవాడలో టెన్షన్..టెన్షన్.. పట్టాభి ఎక్కడ..?