TCS:దేశీయ ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్-టీసీఎస్… ఉద్యోగులకు, నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సంస్థ నుంచి ఒక్క ఉద్యోగిని కూడా తీసివేయబోమని ప్రకటించిన టీసీఎస్… ఈ ఏడాది కొత్తగా 40 వేల మందికిపైగా ట్రైనీలను నియమించుకుంటామని ప్రకటించింది. అంతేకాదు… స్టార్టప్ కంపెనీల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారికి కూడా అవకాశాలు కల్పిస్తామని వెల్లడించింది. దాంతో… తమ సంస్థపైనా ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ పడుతుందేమో, ఉద్యోగం ఊడుతుందేమోనని బిక్కుబిక్కుమంటూ గడిపిన టీసీఎస్ సిబ్బంది… కొత్త ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లు, ఇప్పుడు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఒకసారి ఉద్యోగిని నియమించుకున్న తర్వాత… వారి ప్రతిభ పెరిగేలా, వృత్తి జీవితం సాఫీగా సాగేలా చూసుకుంటామంటోంది… టీసీఎస్. కొన్ని కంపెనీలు అవసరం లేకపోయినా ఎక్కువ మందిని నియమించుకుని, పరిస్థితుల సాకుతో ఇప్పుడు బలవంతంగా ఇంటికి సాగనంపుతున్నాయని సంస్థ అభిప్రాయపడింది. ప్రస్తుతం టీసీఎస్లో సుమారు 6 లక్షల మంది పని చేస్తున్నారని, గతంలో మాదిరే అందరికీ వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చింది. వివిధ సంస్థలు తీసేసిన నిపుణులను నియమించుకుంటామని… ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, క్లౌడ్, యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్, ప్రోడక్ట్ ఎక్స్పీరియన్స్ వంటి రంగాల్లో ప్రతిభావంతుల కోసం వెతుకుతున్నామని తెలిపింది.
నిరుడు లక్షా 19 వేల మంది ఫ్రెషర్స్ సహా… మొత్తం 2 లక్షల మందిని నియమించుకుంది… టీసీఎస్. వీరిలో చాలా మంది ట్రైనీలకు ప్రాజెక్టుల్లో అవకాశం కల్పించాల్సి ఉంది. దీని వల్ల ఈ ఏడాది నియామకాలు కాస్త తగ్గే అవకాశం ఉందని… అయినా 40 వేల మందికి పైగా ట్రైనీలకు అవకాశం ఇస్తామని పేర్కొంది. ప్రస్తుతం 40 శాతం మంది ఉద్యోగులు వారానికి 3 సార్లు, 60 శాతం మంది సిబ్బంది వారానికి 2 సార్లు ఆఫీసులకు వస్తున్నారని, త్వరలోనే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని టీసీఎస్ ఆశాభావం వ్యక్తం చేసింది.
Electric Cars:ఈవీ కొంటున్నారా? ముందుగా ఏం తెలుసుకోవాలంటే..
Drive in Theatre:హైదరాబాద్లో తొలి శాశ్వత డ్రైవ్-ఇన్ థియేటర్.. ఎక్కడంటే!