Sayanna : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న మృతి చెందారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయన్న తుదిశ్వాస విడిచారు.
1951 మార్చి 5న చిక్కడపల్లిలో సాయన్న జన్మించారు. టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1994 నుంచి 2015 వరకు టీడీపీలోనే ఉన్నారు. 1994, 1999, 2004, 2014లో టీడీపీ తరఫున సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 మాత్రమే ఆయన ఓటమి చవిచూశారు. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.
జి. సాయన్న రాష్ట్ర విభజన తర్వాత 2015లో బీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇలా మొత్తం ఐదుసార్లు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2015 నుంచి కొంతకాలం టీటీడీ పాలకమండలి సభ్యుడిగానూ పనిచేశారు. హుడా డైరెక్టర్గా 6సార్లు బాధ్యతలు నిర్వర్తించారు.
సాయన్న సేవలు చిరస్మరణీయం: సీఎం కేసీఆర్
ఎమ్మెల్యే సాయన్న మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా చేసిన ప్రజాసేవ చిరస్మరణీయం అని ప్రశంసించారు. ఆయన కుటుంబసభ్యులకు కేసీఆర్ ప్రగాఢసానుభూతి తెలిపారు.
రాజకీయ ప్రముఖులు సంతాపం..
కేంద్రమంత్రి కిషన్రెడ్డి సాయన్న మృతిపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సాయన్న మృతిపై మంత్రి కేటీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు దేవుడు మనోధైర్యం ప్రసాదించాలని మంత్రి నిరంజన్రెడ్డి ప్రార్థించారు. ఎమ్మెల్యే సాయన్న అకాల మరణంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ట్విటర్ ద్వారా సంతాపం ప్రకటించారు. సాయన్న అకాల మరణం బాధాకరమని ట్వీట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.
సాయన్న ఎనలేని సేవలు అందించారు : రేవంత్ రెడ్డి
ఎమ్మెల్యే సాయన్న మరణంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సాయన్న ఎంతో సౌమ్యుడని పేర్కొన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో నగర ప్రజలకు ఎనలేని సేవలందించిన సాయన్న అకాల మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని ట్వీట్ చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Sharmila: వైఎస్ షర్మిల అరెస్ట్.. పాదయాత్ర అనుమతి రద్దు
Sharmila : తగ్గదేలే.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై షర్మిల మళ్లీ ఫైర్..