kitchen budget : ఎంత జాగ్రత్తగా ఖర్చు చేసినా… నెలాఖరు వచ్చే సరికి చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలకపోవడం… ప్రతీ సామాన్య కుటుంబానికీ అనుభవమే. ఎప్పటికప్పుడు పెరిగిపోతున్న ధరలతో… మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల జీవనం భారంగా మారుతోంది. మరీ ముఖ్యంగా గత రెండు నెలలుగా పెరిగిన ధరలు… సామాన్యుల వంటింటి బడ్జెట్ను తలకిందులు చేశాయి.
కొన్ని నెలలుగా పాల ధర క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఒక్క పాల ధరలోనే 14 నుంచి 15 శాతం పెరుగుదల నమోదైంది. ఉత్పత్తి వ్యయం పెరగడమే పాల రేట్లు పెరగడానికి కారణమని చెబుతున్నారు. ఇటీవలే అమూల్ లీటర్ పాలపై రూ.3 పెంచింది. ఆ కంపెనీకి చెందిన లీటర్ ఫుల్ క్రీమ్ గోల్డ్ మిల్క్ రూ.66కు చేరింది. అమూల్ పాల ధర పెంచాక… మిగతా కంపెనీలు కూడా పాల ధర పెంచేశాయి.
ఇక బియ్యం ధరలు కూడా భారీగా పెరిగాయి. బాస్మతి, నాన్ బాస్మతి బియ్యం ధరలు 15 శాతం పెరిగాయి. దేశీయంగా ఉత్పత్తి తగ్గడం, ఎగుమతి డిమాండ్ పెరగడమే బియ్యం ధరలు దూసుకెళ్లడానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. 2022 డిసెంబర్లో రూ.90-95 మధ్య ఉన్న కిలో బాస్మతి బియ్యం ధర… ఈ ఏడాది జనవరిలో రూ.105కు చేరింది. గోధుమపిండి ధరలు కూడా క్రమంగా కొండెక్కుతున్నాయి. దాంతో… ధరల్ని నియంత్రించడానికి రోండో విడత ఈ-వేలంలో 3.85 లక్షల టన్నుల గోధుమలను బల్క్ వ్యాపారులకు అమ్మేసింది… ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ ఏడాది ఉత్పత్తి అంచనాలు తగ్గడంతో… కొన్ని పప్పు ధాన్యాల ధరలు కూడా పెరిగాయి. అంతేకాదు… లక్షలాది భారతీయ కుటుంబాలు ప్రతిరోజూ వినియోగించే ముఖ్యమైన ఆహార వస్తువైన గుడ్ల ధర కూడా దేశవ్యాప్తంగా భారీగా పెరిగింది. గత జనవరిలో కూరగాయల ధరలు ఒక్కటే కాస్త తగ్గినా… తృణధాన్యాలు, గుడ్లు, మాంసం, చేపలు, పాల ఉత్పత్తులు, నూనెల ధరలు పెరగడంతో… ద్రవ్యోల్బణం కూడా పెరిగింది. కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాల ధరలు భవిష్యత్తులోనూ పెరిగే అవకాశం ఉన్నందున… సామాన్య జనానికి బతుకు భారమేనని నిపుణులు అంటున్నారు.
Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. మనీశ్ సిసోడియాకు మళ్లీ నోటీసులు
Cheetah: భారత్కు చేరుకున్న మరో 12 చీతాలు..