Manish Sisodia: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. తాజాగా ఢిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 19న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో తాజాగా దొరికిన ఆధారాలపై ప్రశ్నించేందుకు మనీశ్ సిసోడియాకు నోటీసులు జారీ చేసినట్లు సీబీఐ వెల్లడించింది.
కాగా, ఈ కేసులో సిసోడియాను గతేడాది అక్టోబర్లో సీబీఐ విచారించింది. దాదాపు తొమ్మిది గంటలపాటు అధికారులు ఆయన్ను విచారించారు. ఇప్పటి వరకు ఈ కేసులో సిసోడియా సన్నిహితుడు విజయ్ నాయర్తో పాటు అభిషేక్ బోయినపల్లి, బినోయ్ బాబు, శరత్ చంద్రారెడ్డి, సమీర్ మహేంద్రులపై సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
ఇక సీబీఐ నోటీసులు పంపించడంపై మనీశ్ సిసోడియా స్పందించారు. లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ తనకు మరోసారి నోటీసులు జారీ చేసిందని తెలిపారు. గతంలో కూడా తన ఇంట్లో, బ్యాంక్ లాకర్నూ తనిఖీ చేసినప్పటికీ.. వారికి ఎటువంటి ఆధారాలు దొరకలేదన్నారు. పిల్లలకు ఉత్తమ విద్యను అందించాలని తాను ప్రయత్నిస్తుంటే.. కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు.