Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనవరి 27 నుంచి చేపట్టనున్న పాదయాత్రపై ఉత్కంఠ నెలకొంది. అనుమతి కోసం టీడీపీ లేఖ రాస్తే.. డీజీపీ కోరిన వివరాలపై వివాదం నడుస్తోంది. ఇంకా అనుమతి ఇవ్వకపోవడంపై టీడీపీ నేతలు డీజీపీ వైఖరిని తప్పుపడుతున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్ లో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి నడుస్తున్నారని విమర్శలు గుప్పించారు.
ఏపీలో యువగళం పేరుతో 400 రోజులపాటు లోకేష్ పాదయాత్ర సాగనుంది. మొత్తం 4 వేల కిలోమీటర్లు నడిచేందుకు లోకేష్ సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో పాదయాత్రకు అనుమతి కోసం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఈ నెల 9న డీజీపీకి లేఖ రాశారు. ఈ నెల 20 వరకు డీజీపీ నుంచి స్పందన రాలేదు. దీంతో మరోసారి లేఖ ద్వారా పాదయాత్ర అనుమతి విషయాన్ని గుర్తు చేశారు. ఈ నెల 9న రాసిన లేఖ అందిందని రూట్ మ్యాప్, కాన్వాయ్ వాహనాల జాబితా, పాదయాత్రలో పాల్గొనే వారి వివరాలివ్వాలని ఈ నెల 21న మెసెంజర్ ద్వారా ఒక లేఖను వర్ల రామయ్యకు పంపారు డీజీపీ.
డీజీపీ కోరిన వివరాలపై వర్ల రామయ్య మండిపడ్డారు. పాదయాత్రలో లోకేశ్ లక్షల మందిని కలుస్తారని వారందరి వివరాలు ఎలా ఇవ్వగలమని ప్రశ్నించారు. 2017లో జగన్ పాదయాత్ర చేస్తున్నసమయంలో అనుమతి అవసరం లేదని ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటన చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు లోకేష్ ఎందుకు అనుమతి తీసుకోవాలని నిలదీశారు. ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు? అని వర్ల నిలదీశారు. ఎవరి సలహా మేరకు ఇలా వ్యవహరిస్తున్నారని డీజీపీపై మండిపడ్డారు. పాదయాత్రలో లోకేశ్ ఎవరెవరితో మాట్లాడతారో చెప్పడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. ఎంత మందిని కలుస్తారో ఎలా చెప్పగలం? వారి ఆధార్ కార్డులు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, పాన్ కార్డులను ఎలా ఇవ్వగలం? ఇవన్నీ పోలీసు అధికారిగా అడుగుతున్నారా? సజ్జల శిష్యుడిగా అడుగుతున్నారా? అని వర్ల రామయ్య ఘాటుగా ప్రశ్నించారు. తనకు పంపిన లేఖను డీజీపీ వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. దేశంలో పోలీసు రాజ్యాంగం ప్రకారం లోకేశ్కు పాదయాత్ర చేసే హక్కు ఉందని దీన్ని పరిగణనలోకి తీసుకుని అనుమతి ఇవ్వాలని వర్ల డిమాండు చేశారు. ఒకవేళ అనుమతి ఇవ్వకపోయినా పాదయాత్ర ఆగదని స్పష్టం చేశారు.
అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా యువగళం పాదయాత్ర జరిగి తీరుతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. లోకేష్ పాదయాత్ర ప్రకటించినప్పటి నుంచి వైసీపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. జగన్ రెడ్డి పరిపాలన బాగా సాగుతుందని చెబుతున్న వైసీపీ నేతలు లోకేష్ పాదయాత్రకు ఎందుకు భయపడుతున్నారని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకట్రావు ప్రశ్నించారు. లోకేష్ పాదయాత్ర ఒక సాహసయాత్ర కాబోతోందని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు, లోకేష్ పాదయాత్ర కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. లోకేష్ ఎవరిని కలిసేది, ఎక్కడ బస చేసేది చెప్పాలా?… దీని వెనుక కుట్ర దాగి ఉందని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అనుమానం వ్యక్తం చేశారు. వైసీపీకి వంత పాడుతున్న పోలీసు అధికారులకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
మరోవైపు లోకేష్ ఈ నెల 25న రాత్రికి తిరుమల వెళ్లనున్నారు. కడప నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటారు. ఆ రోజు రాత్రికి తిరుమలలోనే బస చేస్తారు. ఈ నెల 26న ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. యువగళం పాదయాత్ర ప్రారంభానికి ముందు స్వామివారి ఆశీస్సులు పొందుతారు. ఆ తర్వాత లోకేష్ తిరుమల నుంచి నేరుగా కుప్పం చేరుకుని అక్కడ నుంచే పాదయాత్రకు శ్రీకారం చుడతారు. మరి పోలీసులు అనుమతి ఇస్తారా? ఇవ్వకపోయినా లోకేష్ ముందుకు సాగుతారా? వేచి చూడాలి.