Modi : ప్రధాని నరేంద్ర మోదీపై బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రశంసలు కురిపించారు. సినిమాలపై అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని మోదీ ఇటీవల బీజేపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై అక్షయ్ కుమార్ స్పందించారు. మోదీ దేశంలోనే అత్యంత ప్రభావశీల వ్యక్తి అని కొనియాడారు. ప్రధాని వ్యాఖ్యలు కాస్తయినా మార్పు తీసుకురాగలిగితే సినీ పరిశ్రమకు గొప్ప మేలు కలుగుతుందని అక్షయ్ అన్నారు.
అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించిన ‘సెల్ఫీ’ ట్రైలర్ విడుదల కార్యక్రమం ముంబయిలో నిర్వహించారు. సానుకూల దృక్పథాన్ని ఎల్లవేళలా స్వాగతించాలని అక్షయ్ అన్నారు. ప్రస్తుత పరిస్థితులు మారాలని స్పష్టం చేశారు. తాము సినిమాలు తీయడానికి ఎంతో శ్రమిస్తామని తెలిపారు. ఆ తర్వాత సెన్సార్ బోర్డుకు తీసుకెళ్లి ధ్రువీకరణ పొందుతామన్నారు. ఇలా ఎంతో కష్టపడి సినిమాను నిర్మించిన తర్వాత ఎవరో చేసే అనవసర వ్యాఖ్యలతో వివాదాలు రేగుతున్నాయన్నారు. దీంతో ఆయా ఆయా సినిమాల విడుదలకు ఇబ్బందులు ఎదురువుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోదీ చెప్పిన మాటలతో సినీ పరిశ్రమకు మేలు జరుగుతుందని అక్షయ్ అన్నారు.
షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా నటించిన ‘పఠాన్’ చిత్రంలోని ‘బేషరమ్ రంగ్’ పాటపై బీజేపీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ పాటలోని కొన్ని దృశ్యాలు తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ సినిమాను అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. మధ్య ప్రదేశ్ లో సినిమా ప్రదర్శనకు అనుమతి ఇవ్వమని ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా వార్నింగ్ ఇవ్వడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇలాంటి సమయంలో బీజేపీ నేతలకు, కార్యకర్తలకు సినిమాలపై అనవసర వ్యాఖ్యలు చేయద్దని మోదీ గట్టిగా చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలపై అక్షయ్ కుమార్ స్పందించారు.