Modi :- ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 13న హైదరాబాద్ కు రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. వాస్తవానికి ప్రధాని నరేంద్రమోదీ జనవరి 19న తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలతో ఆ పర్యటన వాయిదాపడింది.
ప్రధాని మోదీ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేసేందుకు కాషాయ నేతలు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. రాష్ట్రంలో ఈ ఏడాది డిసెంబర్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే సభలో ప్రధాని తెలంగాణకు ఎలాంటి వరాలు ప్రకటిస్తారు? జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్ పైనా, తెలంగాణ సీఎం కేసీఆర్ పైనా ఎలాంటి విమర్శలు చేయబోతున్నారని ఆసక్తి నెలకొంది. బీజేపీ శ్రేణులకు మోదీ ఎలాంటి భరోసా కల్పిస్తారో చూడాలి. ఈ సభ కోసం కాషాయ నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. సభకు భారీగా జనసమీకరణ చేపట్టేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం సన్నద్ధమవుతోంది. మొత్తంమీద మోదీ సభ తర్వాత బీజేపీకి మరింత ఊపు వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇదే సమయంలో కొందరు నేతలు మోదీ సమక్షంలో బీజేపీలో చేరే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.
మరోవైపు తెలంగాణలో అమిత్ షా పర్యటన వాయిదా పడింది. ఈ నెల 28న అమిత్ షా రావాల్సి ఉండగా పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో రావడంలేదు. ఆదివారం నుంచి తెలంగాణలో కేంద్ర మంత్రులు పర్యటించనున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రి బి.ఎల్ వర్మ వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల్లో పర్యటిస్తున్నారు. ఈ నెల 22, 23, 24 తేదీల్లో మెదక్ పార్లమెంట్ పరిధిలో కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల పర్యటిస్తారు. ఈ నెల 23, 24 తేదీల్లో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి పర్యటిస్తారు. వీరంతా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తారు. ఇలా తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ అధిష్టానం అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
Follow this link for more updates:- Bigtv