Modi : పఠాన్ చిత్రంపై బీజేపీ నేతలు నానా రాద్ధాంతం చేశారు. ఆ సినిమాను అడ్డుకుంటామని హెచ్చరికలు చేశారు. దీంతో జాతీయస్థాయిలో పెనుదుమారం రేగింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సినిమాల విషయంలో అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని గట్టి చెప్పినట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మోదీ పార్టీ నేతలకు ఇలాంటి విషయాలపై సూచనలు చేశారని సమాచారం.
ఢిల్లీలో రెండు రోజుల పాటు బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఈ సభల్లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. దేశ అభివృద్ధి కోసం ర మనమంతా కష్టపడుతుంటే కొందరు సినిమాల లాంటి అంశాలపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని మోదీ మండిపడ్డారు. అలాంటి వార్తలు మీడియాలో పదే పదే ప్రసారమవుతున్నాయని దీంతో పార్టీ అభివృద్ధి అజెండా పక్కకు పోతోందని తెలిపారు. అందుకే అలాంటి అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని పార్టీ నేతలకు మోదీ హితవు పలికారు.
ప్రధాని మోదీ ఏ సినిమా పేరును నేరుగా ప్రస్తావించకపోయినా ‘పఠాన్ ’ చిత్రంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా నటించిన ‘పఠాన్’ చిత్రంపై ఇటీవల పలువురు బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మూవీలోని ‘బేషరమ్ రంగ్’ పాటలో అశ్లీలత ఎక్కువగా ఉందని ఈ చిత్రంపై నిషేధం విధించాలని డిమాండ్లు చేశారు. ఈ పాటలో దీపికా పదుకొనే కాషాయ వస్త్రం ధరించడాన్ని తప్పుపట్టారు.
ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఈ వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచారు. మధ్యప్రదేశ్ లో సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు. అటు మహారాష్ట్రలోనూ కొందరు బీజేపీ నేతలు పఠాన్ మూవీపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాలకాదు రాజకీయేతర అంశాలపై బీజేపీ నేతలు తరచూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ వివాదాలపై జాతీయస్థాయిలో చర్చ జరుగుతోంది. ఇలాంటి అంశాలు కేంద్రానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాయని మోదీ భావించారు. ఈ నేపథ్యంలోనే పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.