Srikurmam temple in A .P : మహావిష్ణువు అన్ని అవతారాల్లో దుష్ట శిక్షణ జరిగింది. కానీ కూర్మావతారంలో మాత్రం అలా కాలేదు. క్షీరసాగర మధనంలో కూర్మావతారం ధరించిన మహావిష్ణువు అదే అవతారంలో పూజలందుకుంటున్న ఆలయం ఈ ప్రపంచంలో ఒక్కటే ఉంది. శ్రీకాకుళం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో శ్రీ కూర్మం గ్రామంలో ఈ అరుదైన దేవాలయం ఉంది. గర్భగుడిలో కొలువైన కూర్మనాధ స్వామి విగ్రహం నుంచి ఆలయం వెలుపల నిర్మాణాల వరకూ ప్రతీదీ ప్రత్యేకంగా చెప్పవచ్చు.బ్రహ్మ ప్రతిష్ఠించిన పంచలింగ క్షేత్రంగానూ ఈ ఆలయం ప్రసిద్ధి. ద్వాపర యుగం కాలంలో బలరాముడు శ్రీకూర్మం దర్శనానికి వచ్చిన సమయంలో క్షేత్రపాలకుడైన బైరవుడు ఆయనను లోనికి అనుమతించడు. దీంతో ఆగ్రహానికి గురైన బలరాముడు భూమిపై మరెక్కడా కూర్మావతారంలో ఆలయం ఉండకూడదని శపిస్తాడు. అందువల్లే ప్రపంచంలో ఉన్న ఏకైక కూర్మావతార క్షేత్రంగా ఇది ప్రసిద్ధికెక్కినట్లు చెబుతారు.
శ్రీకూర్మంలో స్వామి వారి విగ్రహం పడమటి ముఖంగా ఉంటుంది. ఏ ఆలయంలో లేని విధంగా ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు కనిపిస్తాయి. ఆలయంలో దొరికిన చారిత్రక ఆధారాల ప్రకారం 4వ శతాబ్ధానికి ముందే ఆలయం నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది. 7వ శతాబ్ధం నుంచి ఈ ఆలయ ప్రాముఖ్యత విస్తరించినట్లు చెబుతారు. గాంధర్వ శిల్ప సంపాద అని పిలువబడే స్తంభాలు ఆనాటి రాజుల పేర్లు, కీర్తిని చాటిచెబుతాయి.
పూర్వం దేవ దానవులు అమృతం కోసం క్షీర సాగరాన్ని మదించడానికి యత్నించి, మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు. కింద ఆధారం లేకపోవడంతో ఆ పర్వతం నిలవలేదు. దాంతో దేవతలు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా.. విష్ణువు తాబేలు అవతారమెత్తి మందర పర్వతానికి ఆధారంగా నిలిచాడని కూర్మ పురాణం చెబుతోంది. విష్ణువు కూర్మావతారంలో ఉన్న ఏకైక స్వయంభు ఆలయం ఇది. నిత్యాభిషేకాలు జరుగుతుంటాయి.
ప్రపంచంలో దుర్గామాత వైష్ణోదేవి రూపంలో ఉన్న రెండో ఆలయం శ్రీకూర్మం. ఇక్కడి నుంచి వారణాసికి వెళ్లడానికి సొరంగ మార్గం ఉందని, ప్రస్తుతం దీనిని మూసివేసినట్లు చెబుతారు. వారణాసి మాదిరిగానే చనిపోయిన వారి అంతిమ కర్మలను నిర్వహించే మోక్ష స్థానంగా శ్రీకూర్మంకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆలయానికి వెలుపల శ్వేత పుష్కరిణి ఉంటుంది. అద్భుతమైన వాస్తు కళతో కనిపించే ఈ ఆలయంలో 108 ఏక శిలా రాతి స్తంభాలు కనిపిస్తాయి. అయితే వీటికి ఒక దానితో ఒకటి పోలిక లేకపోవడం విశేషం.
Follow this link for more updates:- Bigtv