Kanuma Muggulu specialty : పాడిపంటలు, పశువులతో రైతన్న అనుబంధాన్ని ఆవిష్కరించే పండుగ కనుమ. పల్లె సొగసులను అందంగా ఆవిష్కరించే పండగ సంక్రాంతి. మూడు రోజుల పాటు ముచ్చటగా జరుపుకునే పండగలో చివరి వేడుక కనుమ..! తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలు, ఆప్యాయతానురాగాలకి ప్రతీక సంక్రాంతి. అన్నదాతకు, వ్యవసాయానికి దన్నుగా నిలిచే పాడి పశువుల పట్ల కృతజ్ఞత తెలిపే వేడుకే కనుమ..!
పశువుల పండుగగానూ వ్యవహరించే ఈ రోజున.. పశువుల్ని అందంగా అలంకరించి పూజలు చేస్తారు. కనుమ రోజు మినుము తినాలనే ఆచారం మేరకు.. మినప్పప్పుతో పిండి వంటలు చేస్తారు. ఇంటి ముందు రథం ముగ్గులు వేసి.. ఊరి పొలిమేరకు అనుసంధానిస్తారు.
పండుగ రోజుల్లో వేసే ముగ్గుల్లో పౌరాణిక గాథలు, చారిత్రక అంశాలే ఉంటాయి. వైకుంఠ ఏకాదశికి స్వర్గ ద్వారాలు తెరుచుకున్నట్లు, అంతకు ముందు రోజు మూసి ఉన్నట్లుగా ముగ్గులు వేస్తారు.కనుమ రోజున వేసే రథం ముగ్గులకు ప్రత్యేకత ఉంది. ప్రతి మనిషీ రథం అని… ఆ రథం నడిపేవాడు పరబ్రహ్మ అని భావిస్తూ శరీరమనే రథాన్ని సరైన మార్గంలో నడిపించాల్సిందిగా పరమాత్మని ప్రార్థించడమే రథం ముగ్గు ఉద్దేశం. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చిన సంక్రాంతి పురుషుడు… అన్ని శుభాలను కలిగించాలని ఆకాంక్షిస్తూ ఇంటి ముందు రథం ముగ్గులు వేసి అందులో పళ్లు-పూలు, పసుపు-కుంకుమ వేసి గౌరవంగా సాగనంపుతారు. వాకిళ్లలో వేసిన రథం ముగ్గును పక్కింటి ముగ్గుతో అనుసంధానం చేస్తారు. ఈ విధంగా ప్రతి ఇంటి ముందు గీసిన గీతలన్నీ ఊరు పొలిమేర వరకూ సాగుతాయి. ఈ సంప్రదాయం ఆంధ్ర, తెలంగాణలో ఎక్కువ పాటిస్తారు.
ఈ రోజు సూర్య దేవుడిని ప్రార్థిస్తే… ఆరోగ్యంతో పాటు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రజల నమ్మకం. అందుకే ఇంటి ముందు రథం ముగ్గులు వేసి ఆ దేవుడిని గుర్తు చేసుకుంటారు.సంక్రాంతి పండుగలో అంటే ముగ్గులకు ఇదే చివరి రోజు. తర్వాత రోజు నుంచి ఎప్పటిలాగా సాధారణ ముగ్గులే వేస్తారు. కొన్నిచోట్ల ప్రభల తీర్థం ఉత్సవంతో.. సంక్రాంతి సంబరాలు ముగుస్తాయి