Musk auctions off Twitter’s goods : కేవలం ఏడాది వ్యవధిలో అత్యధిక సంపద కోల్పోయిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డు సృష్టించిన టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్… ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు దొరికిన ఏ మార్గాన్నీ విడిచిపెట్టడం లేదు. ఆఖరికి కంపెనీ వస్తువులను కూడా వేలానికి పెట్టాడు… మస్క్. మొత్తం 631 రకాల వస్తువులను వేలానికి ఉంచాడు. దాంతో… మస్క్ ఆర్థికంగా అంతలా చికితిపోయాడా? అనే చర్చ జరుగుతోంది.
ట్విట్టర్ లోగో అయిన పక్షి ప్రతిమతో పాటు కాఫీ మెషిన్లు, ఫర్నీచర్, చివరకు కిచెన్ సామగ్రిని కూడా మస్క్ వేలంలో అమ్మకానికి పెట్టారు. ఈ వేలాన్ని హెరిటేజ్ గ్లోబల్ పార్ట్నర్స్ కంపెనీ నిర్వహించింది. ఇందులో ట్విట్టర్ లోగో ప్రతిమకు అత్యధిక మొత్తం వచ్చినట్లు హెరిటేజ్ గ్లోబల్ వెల్లడించింది. నాలుగు అడుగుల ఈ ప్రతిమ లక్ష డాలర్లకు… అంటే మన కరెన్సీలో దాదాపు 82 లక్షల రూపాయలకు అమ్ముడుపోయింది. 10 అడుగుల నియాన్ ట్విట్టర్ బర్డ్ డిస్ప్లే 40 వేల డాలర్లు… అంటే 32 లక్షలు పలికింది. బీర్లను నిల్వ చేసుకునే మూడు కెగేటర్లు, ఫుడ్ డీహైడ్రేటర్, పిజ్జా ఓవెన్.. ఒక్కోటీ 10 వేల డాలర్లకు అమ్ముయ్యాయి. ‘@’సింబల్ రూపంలో ఉన్న ప్లాంటర్ 15 వేల డాలర్లు, కాన్ఫరెన్స్ రూం టేబుల్ 10 వేల 500 డాలర్లు పలికాయి. ఇక ఫేస్మాస్క్లు, సౌండ్ ప్రూఫ్ ఫోన్ బూత్లకు మరో 4 వేల డాలర్లు వచ్చాయి.
మరోవైపు, ట్విట్టర్లో మరిన్ని తొలగింపులు చేపట్టేందుకు మస్క్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరో 50 మందిని త్వరలోనే మస్క్ ఇంటికి పంపబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రొడక్ట్ విభాగంలో అధిక తొలగింపులు ఉండొచ్చని చెబుతున్నారు. అంతేకాదు… ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక ఆఫీసులతో పాటు, అమెరికాలోని చిన్న చిన్న ఆఫీసులను కూడా మూసివేయాలని మస్క్ భావిస్తున్నాడని అంటున్నారు. ఇదే జరిగితే చాలా మంది ఉద్యోగాలు ఊడిపోయే అవకాశం ఉంది. రెండు వారాల కిందటే వాణిజ్య ప్రకటనలు, ట్రస్ట్ అండ్ సేఫ్టీ, మానిటైజేషన్ విభాగాల నుంచి ఉద్యోగులను తొలగించిన మస్క్… సింగపూర్, ఆస్ట్రేలియా ఆఫీసుల్లోని కొందరు సిబ్బందినీ తీసేశారు. తాజా కోతలు కూడా అమల్లోకి వస్తే ట్విట్టర్ ఉద్యోగుల సంఖ్య 2 వేల కంటే తక్కువ కానుంది. అంటే, సంస్థ మస్క్ చేతుల్లోకి వచ్చాక మొత్తం 75 శాతం మందిని తీసేసినట్లు అవుతుంది.
Follow this link for more updates:- Bigtv