Bandi Sanjay : ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేంద్ర ప్రభుత్వ విధానాలపై సీఎం కేసీఆర్ చేసిన విమర్శలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. గులాబీ బాస్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు. అగ్నిపథ్ బిపిన్ రావత్ ఆలోచన అని ఆయన కంటే ఎక్కువ కేసీఆర్కు తెలుసా అని ప్రశ్నించారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడిన కేసీఆర్..మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించిన సమాజ్ వాదీ పార్టీతో ఎందుకు జతకట్టారని నిలదీశారు. దళితులను వంచించిన కేసీఆర్ కు వాళ్ల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. రాష్ట్రంలో ఎంత మందికి దళిత బంధు ఇస్తున్నారో చెప్పాలన్నారు.
జల వివాదాల సంగతేంటి?
కొత్త నీటి ప్రాజెక్టులను ఎలా కడతారో కేసీఆర్ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. గోదావరిలో ఉన్న నీటి లభ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వం సరిగా వాడుకోవడం లేదని ఆరోపించారు. నీటి వివాదాల పరిష్కారానికి ఏం చేస్తారో స్పష్టత ఇవ్వాలని కోరారు. తెలంగాణలో 21 డ్యామ్ ల నిర్మాణాలను 8 ఏళ్ల నుంచి పెండింగులో పెడుతున్నారని మండిపడ్డారు. పొలం దగ్గర ఫ్రీ కరెంట్ అని, ఇంటి దగ్గర కరెంట్ కు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ముందు డిస్క్ంలకు బకాయిలు చెల్లించాలని సూచించారు. కొత్త రూల్స్ పెట్టి పోలీస్ రిక్రూట్ మెంట్ సరిగా చేయడం లేదని బండి ఆరోపించారు.
ఆ నేతలు ఎందుకు రాలేదు?
ఖమ్మం బీఆర్ఎస్ సభకు కొందరు జాతీయ నేతల రాకపోవడంపై బండి సంజయ్ విమర్శనాస్త్రాలు సంధించారు. కుమారస్వామి, నితీష్ కుమార్ బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు రాకపోవడంపై సెటైర్లు వేశారు. కేసీఆర్ దగ్గర ఉన్న లిక్కర్ డబ్బులు పంచుకోవడానికి కొందరు నేతలు వచ్చినట్లున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వచ్చిన నేతలు మళ్లీ రారని తెలిపారు. ఖమ్మం సభలో కేసీఆర్ చెప్పినవన్నీ గతంలో చెప్పినవే అని అన్నారు. కొత్తగా ఏం మాట్లాడలేదని అన్నారు.
మ్యాచ్ హైలెట్.. సభ ఫట్..
ఉప్పల్ లో జరిగిన భారత్ – న్యూజిలాండ్ మ్యాచ్ ను తప్పా.. బీఆర్ఎస్ సభను ఎవరు పట్టించుకోలేదని బండి సంజయ్ అన్నారు. ప్రజలను బెదిరించి సభను సక్సెస్ చేయాలని చూశారని ఆరోపించారు. కేసీఆర్ ఏ దేశం బాగుందని చెబితే ఆ దేశం సర్వనాశనం అవుతుందని అన్నారు. పాకిస్థాన్ గురించి మాట్లాడితే అక్కడ దుర్భర పరిస్థితులు వచ్చాయన్నారు. దయచేసి మన దేశం బాగుందనే మాట కేసీఆర్ నోటి వెంట రాకూడదని కోరుకుంటున్నానని బండి సంజయ్ అన్నారు.
జై తెలంగాణ అనిపిస్తాం..
ఖమ్మం సభలో కేసీఆర్ జై తెలంగాణ అని అనలేదని బండి సంజయ్ అన్నారు. తెలంగాణను మరచిపోయిన కేసీఆర్ తో జై తెలంగాణ అనిపిస్తామన్నారు. ఒక విషయంలో కేసీఆర్, పంజాబ్ సీఎంలు ఒకటే అని అన్నారు. ఖమ్మం సభకు వచ్చిన నలుగురు నేతలు నాలుగు స్కామ్ లలో ఉన్నారని ఆరోపించారు. ఒక్క నేత బీఆర్ఎస్ గురించి మాట్లాడలేదన్నారు. దేశంలో వచ్చేది ఆప్ ప్రభుత్వం అని కేజ్రీవాల్ ప్రకటించారని, మరి బీఆర్ఎస్ సంగతి ఏమిటి? అని బండి సంజయ్ ప్రశ్నించారు.