Kamareddy : కామారెడ్డిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాస్టర్ ప్లాన్ వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని కొన్ని రోజులుగా విలీన గ్రామాల రైతులు ఆందోళన చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రద్దుపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో నిరసనలు కొనసాగిస్తున్నారు. సర్కార్ పై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమబాట పట్టారు.
విలీన గ్రామాల కౌన్సిలర్లు రాజీనామా చేయాలని రైతు జేఏసీ నిర్ణయించింది. గురువారం వరకు కౌన్సిలర్లకు డెడ్ లైన్ పెట్టింది. ఇప్పటికే ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు రాజీనామా చేసి రైతులకు మద్దతు ప్రకటించారు. ఇంకా ఏడుగురు అధికార పార్టీ కౌన్సిలర్లు రాజీనామా చేయలేదు. వారి రాజీనామాపై ఉత్కంఠ నెలకొంది. వారి ఇళ్ల ముట్టడి రైతు జేఏసీ పిలుపునివ్వడంతో కామారెడ్డిలో టెన్షన్ వాతావరణ ఏర్పడింది.
బీజేపీ సభ్యులు రాజీనామాతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇరకాటంలో పడ్డారు . కానీ అధికార పార్టీ కౌన్సిలర్లు రాజీనామాపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతు జేఏసీ మిగిలిన ఆరు గ్రామాల కౌన్సిలర్లు ఈ నెల 19 లోపు రాజీనామా చేయాలని తీర్మానించింది. కౌన్సిలర్లు రాజీనామా చేయకపోతే వారి ఇళ్లు ముట్టడిస్తామని రైతు జేఏసీ ప్రకటించింది.
శుక్రవారంలోగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు తీర్మానం చేయించాలని రైతు జేఏసీ నాయకులు కోరుతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు తెలియజేశారు. మాస్టర్ ప్లాన్ రద్దుపై తీర్మానం చేయకపోతే ఎమ్మెల్యే ఇల్లు ముట్టడిస్తామని రైతు జేఏసీ హెచ్చరించింది. ఓవైపు కౌన్సిలర్లు, మరో వైపు ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పై ఒత్తిడితో కామారెడ్డిలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. మరోవైపు మాస్టర్ ప్లాన్ వల్ల రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లదని ప్రభుత్వం చెబుతోంది. రైతులు మాత్రం మాస్టర్ ప్లాన్ మార్చాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. మరి కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రేగుతున్న నిరసన జ్వాలలను ప్రభుత్వం ఎలా చల్లార్చుతుందో చూడాలి మరి.