Hanuman:- మన దేశంలో ఏ గుడిలో అయినా దేవుడి కుడిపక్కకు తిరిగీ లేదా గర్భగుడికి అభిముఖంగా దర్శనమివ్వడం మనందరికీ తెలిసిందే. కానీ, ప్రయాగలోని త్రివేణీ సంగమానికి దగ్గర్లో ఉన్న బడే హనుమాన్జీ మందిర్లో మాత్రం ఆంజనేయుడు వెల్లకిలా శయన ముద్రలో స్వామి భక్తులకి దర్శనమిస్తున్నాడు. దేశంలో ఈ ఒక్క ఆలయంలోనే హనుమంతుడు ఇలా వీరముద్రలో కనిపిస్తాడని అంటారు.
హనుమంతుడి విగ్రహం పెద్దగా ఉండటం వల్లే స్వామివారిని బడే హనుమాన్ అని పిలుస్తారు. పేరుకు తగినట్లుగానే బడే హనుమాన్ జీ మందిరంలోని హనుమంతుడి విగ్రహం 20 అడుగుల పొడవూ, 8అడుగుల వెడల్పులో ఉంటుంది. గర్భగుడి కూడా హనుమంతుడు శయనించేందుకు వీలుగా దాదాపు8 అడుగుల లోతుగా ఉంటుంది. ఈ ఆలయానికి వచ్చే భక్తులెవరైనా స్వామివారిని పైనుంచే చూసి పూజించాల్సి ఉంటుంది. స్వామివారికి అభిషేకం చేయడానికి ప్రతిఏటా గంగానదే తరలిరావడం ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత. వర్షాకాలంలో నీటి ప్రవాహ ఉద్ధృతి పెరిగినప్పుడు గంగ ఉప్పొంగి.. గుడి లోపల ఉన్న హనుమంతుడి విగ్రహం వరకూ వస్తుంది. ఆ సమయంలో గంగానదికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తరువాత ఆ నీరు ఎక్కడికి పోతుందనేది ఇప్పటివరకూ ఎవరూ గుర్తించలేకపోయారు.
అలా గంగాజలం ఆంజనేయుడ్ని తాకడం వల్ల దేశంలో సుఖసంతోషాలూ, ప్రశాంతత వెల్లివిరుస్తాయని స్థానికుల నమ్మకం. ఈ వింతను చూసేందుకే భక్తులు వర్షాకాలంలో ఎక్కువగా ఈ ఆలయానికి వస్తుంటారు.ఆంజనేయుడి కుడిపాదం దగ్గర రావణుడి విగ్రహం ఉంటుంది. దుర్భుద్ధి ఉన్నవారిని హనుమంతుడు నశింప చేస్తాడనడానికి సంకేతమే ఆ విగ్రహమని భక్తులు విశ్వసిస్తారు. అలాగే మరోపాదం దగ్గర మనోధైర్యానికి నిదర్శనమైన కామద దేవి, నుదుటి దగ్గర రాముడు, లక్ష్మణుడి విగ్రహాలు కనిపిస్తాయి. ఇక్కడ హనుమాన్ జయంతి రోజున విశేషంగా పూజలు జరుగుతాయి.
మిగిలిన రోజుల్లో మామూలుగానే భక్తులు వచ్చి… స్వామిని దర్శించుకుని కోరినట్లుగా పూజలు చేయించుకోవచ్చు. బడే ఆంజనేయస్వామిని దర్శించేందుకు భక్తులు దేశం నలుమూలల నుంచీ వస్తుంటారు. ఇది ప్రయాగలోని త్రివేణీ సంగమానికి దగ్గర్లోనే ఉంటుంది. మార్చి, అక్టోబరు నెలలు ఈ ఆలయాన్ని దర్శించేందుకు అనువైన సమయం.
Follow this link for more updates:- Bigtv