BRS: బుధవారం ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ. ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు తరలివస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, కుమారస్వామిలు కూడా హాజరవుతున్నారు. 5 లక్షల మందితో జనసమీకరణ చేస్తున్నారు. 100 ఎకరాల ప్రాంగణంలో సభ ఏర్పాట్లు జరిగాయి. తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా.. ఏపీ, చత్తీస్ గడ్ నుంచి కూడా ప్రజలను తీసుకొచ్చేలా అరేంజ్ మెంట్స్ చేశారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభ వేదికగా యావత్ దేశానికి బలమైన మెసేజ్ ఇవ్వనున్నారు గులాబీ బాస్. మరి, ఖమ్మం సభలో కేసీఆర్ ఏం మాట్లాడనున్నారు? దేశ్ క నేత.. దేశానికి ఏం దిశానిర్దేశం చేయనున్నారు? అంటూ కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అయితే, కేసీఆర్ ప్రసంగంలో ప్రత్యేకతలేమీ ఉండకపోవచ్చని అంటున్నారు. బీఆర్ఎస్ ను ప్రకటించినప్పటి నుంచీ ఏ మాటలైతే చెబుతున్నారో.. మళ్లీ అదే క్యాసెట్ ప్లే చేస్తారని చెబుతున్నారు. ఖమ్మం సభలో బీఆర్ఎస్ అజెండాను, సిద్ధాంతాలను ప్రకటించే ఛాన్సెస్ తక్కువే. విధివిధానాలపై ఇంకా కసరత్తు జరుగుతోందని.. పూర్తిస్థాయి వర్కవుట్ జరిగాకే.. అజెండా ప్రకటిస్తారని తెలుస్తోంది. పొత్తులు, వ్యూహాలు లాంటి ఇన్ సైడ్ మ్యాటర్స్ ఏమీ చెప్పకపోవచ్చని.. కొన్ని రాష్ట్రాల బీఆర్ఎస్ శాఖలు, వాటి అధ్యక్షులు, జాతీయ కమిటీలను అనౌన్స్ చేయొచ్చని సమాచారం. ఖమ్మం సభ కేవలం బల ప్రదర్శనకు మాత్రమేనని.. తాము ఒంటరిగా యుద్ధానికి దిగడం లేదని.. తమవెంట భారీ సైన్యం ఉందనేలా.. బీజేపీకి వణుకు పుట్టించాలనేదే కేసీఆర్ ఎత్తుగడగా తెలుస్తోంది.
ఇక కేసీఆర్ స్పీచ్ అంటే ఖతర్నాక్ డైలాగులు ఎలాగూ ఉంటాయి. ‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదం మరోసారి మారుమోగిస్తారు. అయితే, ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండాయే.. అని అంటారా? లేదా? అనేది ఆసక్తికరం. ఎందుకంటే, ఖమ్మం సభా వేదికపై బీఆర్ఎస్ నేతలతో పాటు ఆప్ ముఖ్యమంత్రులు, కమ్యూనిస్టు సీఎం, ఎస్పీ, జేడీయూ అధినేతలు కూడా ఉండనుండటంతో.. వారి సమక్షంలో ఢిల్లీపై గులాబీ జెండా ఎగరేస్తామనే కాంట్రవర్సీ స్టేట్ మెంట్స్ చేయకపోవచ్చు. ఎందుకంటే.. ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ సైతం ప్రధాని పీఠంపై గురి పెట్టారు కాబట్టి.
బీఆర్ఎస్కు అధికారం ఇస్తే.. రెండేళ్లలో వెలుగు జిలుగుల దేశాన్ని తయారు చేస్తామని.. రైతులందరికీ ఉచిత కరెంట్ ఇస్తామని.. దళిత బంధు అమలు చేస్తామని.. ఇలా తెలంగాణ స్కీములను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని హామీలు ఇవ్వొచ్చు. ఓ వర్గం కోసమో, కులం కోసమో, మతం కోసమో బీఆర్ఎస్ కాదని.. దేశంలో మార్పు తీసుకురావటం కోసమే బీఆర్ఎస్ అని మరోసారి ఉద్ఘాటించవచ్చు. చైనాతో పోల్చడం.. దేశంలోని నీళ్ల లెక్కలు అప్పజెప్పడం.. ఎలాగూ ఉంటుందని అంటున్నారు. ఇక బీజేపీని, కేంద్రాన్ని, మోదీని మరోసారి ఏకిపారేయడం ఖాయం. ఇలా రొటీన్ మాటలతోనే.. కేసీఆర్ నుంచి మంచి మాస్ మసాలా ప్రసంగం ఉంటుందని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.