Tarakaratna: నందమూరి తారకరత్న. ప్రస్తుతం సినిమాలు తక్కువ. వెబ్ సిరీస్ లో కాస్త మెరుస్తున్నారు. అవకాశాలు లేవనో.. రాజకీయాలపై మక్కువతోనే.. పొలిటికల్ ఎంట్రీకి ఆరాటపడుతున్నారు. తనది నందమూరి ఫ్యామిలీ కావడంతో.. స్వతహాగానే రాజకీయాలపై ఆసక్తి ఎక్కువ అంటున్నారు. అలాంటి తారకరత్న.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను కలవడంపై చర్చ జరుగుతోంది. వారిద్దరి భేటీకి కారణం ఏంటా? అనే చర్చ నడుస్తోంది.
మర్యాదపూర్వకంగానే భేటీ అయ్యామని చెబుతున్నారు. అలాగైతే ఓ ఫోన్ కాల్ చేసుకుంటే సరిపోతుందిగా..అంటున్నారు. వారి భేటీ.. రాజకీయ భేటీనేనని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు.
అప్పట్లో నారా భువనేశ్వరి మీద అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేల అసంబద్ధ వ్యాఖ్యలు చేయడంపై నందమూరి కుటుంబం అంతా ఆగ్రహంగా ఉంది. అప్పటి నుంచి ప్రతీకారం కోసం ఎదురుచూస్తోంది. వైసీపీని రాజకీయంగా దెబ్బకొట్టాలని చూస్తోంది. ఇదే సమయంలో తారకరత్న సైతం రాజకీయాలపై ఆసక్తిగా ఉండటంతో టీడీపీ తరఫున బరిలో దిగాలని భావిస్తున్నారు. తనకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం ఉందని తారకరత్న ఈ మధ్య ఓ సందర్భంలో చెప్పారు. అప్పటినుంచీ తారకరత్న పోటీపై చర్చ జరుగుతోంది.
తాజాగా లోకేశ్ ను తారకరత్న కలవడంతో.. వారి భేటీకి రాజకీయ ప్రాధాన్యం పెరిగింది. నందమూరి కుటుంబ సభ్యుడైన తారకరామ అడిగితే.. ఏ సీటైనా ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా ఉంటుంది. మరి, ఆ సీటు ఏ సీటు? అనేదానిపైనే వారిద్దరి మధ్య చర్చ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. తారకరత్న గతంలో టీడీపీ తరపున ప్రచారం కూడా చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఏదైనా ఒక స్థానం నుంచి తారకరత్న పోటీ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు, నారా లోకేష్ ‘యువ గళం’ పేరుతో జనవరి 27 నుంచి ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేయనున్నారు. లోకేష్ పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకే తారకరత్న కలిసి ఉంటారని కూడా అంటున్నారు. అయితే, ఎమ్మెల్యేగా పోటీ కంటే ముందే టీడీపీలో యాక్టివ్ కావాలనే ఉద్దేశంలో తారకరత్న ఉన్నారని.. ఇదే విషయంపై లోకేశ్ తో చర్చించారని కూడా చెబుతున్నారు. కారణం ఏదైనా.. లోకేశ్, తారకరత్నల భేటీ నందమూరి, టీడీపీ అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది.