CM Chandrababu Serious on Minister wife Issue: ఆమె.. రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి సతీమణి. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ విషయం సీఎం వరకు చేరింది. వెంటనే స్పందించిన సీఎం అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ సదరు మంత్రికి సూచించారు. దీంతో ఆయన ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఇతర మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం..
ఏపీ రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి సతీమణి హరితారెడ్డి.. పోలీసులతో ప్రవర్తించిన తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులతో ఆమె మాట్లాడిన విధానాన్ని తప్పుబట్టారు. మంత్రి రామ్ ప్రసాద్ తో ఫోన్ లో మాట్లాడి ఈ అంశంపై వివరణ ఇవ్వాలన్నారు. అధికారులు, ఉద్యోగుల పట్ల అందరూ గౌరవంగా ఉండాలంటూ సీఎం సూచించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తే ఉపేక్షించబోమంటూ హెచ్చరించారు.
Also Read: టీడీపీ ఆఫీసుపై దాడి కేసు.. పోలీసుల విచారణ, త్వరలో అరెస్టులు!
పోలీసుల పట్ల తన భార్య ప్రవర్తనపై మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి పొరపాట్లు మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు. రాయచోటీలో పోలీసులు తనకు కూడా ఎస్కార్ట్ గా రావాలంటూ హరితారెడ్డి వారితో వాగ్వాదానికి దిగారంటూ ఆ వార్తా కథనాల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో వారితో దురుసుగా ప్రవర్తించిన తీరుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.