Indian-origin woman dies on Melbourne-Delhi Qantas flight: చెఫ్ కావాలని లక్ష్యం. 2020లో విదేశాలకు వెళ్లిన ఓ యువతి. నాలుగేళ్ల తర్వాత సొంత దేశానికి తిరుగుప్రయాణం. కానీ కాలం కాటువేసింది. ఇంటికి వెళ్దామని ఫ్లైట్ ఎక్కిన యువతి.. ఫ్లైట్ టేకాఫ్ అయ్యేలోపే అనంత లోకాలకు చేరుకుంది. ఈ హృదయవిదారక సంఘటన మెలబోర్న్లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఇండియాకు చెందిన 24 ఏళ్ల మన్ప్రీత్ కౌర్ చెఫ్ కావాలనే లక్ష్యంతో 2020లో ఆస్ట్రేలియాకు వెళ్లింది. కుకరీలో విద్యను అభ్యసిస్తోన్న కౌర్.. నాలుగేళ్ల తర్వాత సొంతదేశానికి రావాలని నిశ్చయించుకుంది. అందుకు తగ్గట్టుగా సోమవారం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంది. మెల్బోర్న్ నుంచి ఢిల్లీ వెళ్లే కాంటాస్ విమానంలో టికెట్ బుక్ చేసుకుని ప్రయాణానికి సంసిద్ధమైంది.
కన్నవారిని చూడాలనే కోటి ఆశలతో ఫ్లైట్ ఎక్కింది. కానీ అంతలోనే కాలం కాటు వేసింది. సీటు బెల్ట్ పెట్టుకోడానికి కూడా ఇబ్బంది పడుతుంటే క్యాబిన్ సిబ్బంది అత్యవసర సేవల నిమిత్తం బయటకు తీసుకెళ్తుంటే బోర్డింగ్ గేట్ దగ్గర కుప్పకూలిపోయింది. విగతజీవిగా మిగిలిపోయింది. కన్నవారిని చూద్దామని చివరకు అనంతలోకాలకు చేరుకుంది.
Also Read: పారిస్లో రోడ్డుపై కూలిన విమానం, ముగ్గురు మృతి
ప్రాథమికంగా ఆమె మరణానికి టీబీ వ్యాధి కారణమని తెలుస్తోంది. కౌర్ మరణంపై విక్టోరియా పోలీసులు నివేదికను సిద్ధం చేస్తున్నారు. కాగా కాంటాస్ యాజమాన్యం కౌర్ మృతికి సంతాపం తెలిపింది.
మార్చి 2020లో ఆస్ట్రేలియాకు వెళ్లిన మన్ప్రీత్ కౌర్ అప్పటి నుంచి భారతదేశంలోని తన తల్లిదండ్రులను చూడలేదు.
ఈ క్లిష్ట సమయంలో మన్ప్రీత్ కౌర్ కుటుంబానికి మద్దతుగా GoFundMe పేజీ స్థాపించారు. నిధుల సమీకరణ ఆమె జ్ఞాపకార్థం దుఃఖంలో ఉన్న కౌర్ కుటుంబ సభ్యులకు సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు కౌర్ స్నేహితులు. ఈ నిధుల సమీకరణ కుటుంబ ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.