Priyanka defends Rahul Gandhi(Telugu flash news):పార్లమెంటులో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హిందువులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని.. రాహుల్ వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ స్పందించారు. తన సోదరుడు రాహుల్ గాంధీ ఎప్పుడూ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడరన్నారు. ఆ విషయాన్ని సభలో రాహుల్ స్పష్టంగా తెలియజేశారన్నారు ప్రియాంక. లోక్ సభో రాహుల్ మాట్లాడింది హిందువుల గురించి కాదు.. కేవలం బీజేపీ గురించి, ఆ పార్టీ నాయకుల గురించి మాత్రమే అంటూ ఆమె పేర్కొన్నారు.
అయితే, సోమవారం జరిగిన లోక్ సభలో రాహుల్ కొన్ని మతపరమైన ఫొటోలు చూపించారు. దీంతో అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై స్పీకర్ స్పందిస్తూ.. సభలో ఇలాంటి మతపరమైన ఫొటోల ప్రదర్శనకు నిబంధనలు అంగీకరించవని అన్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కలగజేసుకుని రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. హిందువులను హింసావాదులుగా పేర్కొనడం ఆమోదనీయం కాదంటూ ప్రధాని దుయ్యబట్టారు. వెంటనే రాహుల్ మాట్లాడుతూ.. తాను బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశానన్నారు. ఆ పార్టీ, ఆర్ఎస్ఎస్ లే మొత్తం హిందూ సమాజం కాదని అన్నారు. అన్ని మతాలు ధైర్యం, నిర్భయత, అహింస సందేశాలను చాటిచెబుతాయంటూ రాహుల్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. పార్లమెంటులో ప్రతిపక్ష నేతల మైక్ లను కట్ చేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సభాపతి గౌరవానికి సంబంధించిన విషయమని, ఇలాంటి అంశాలపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అనవసర విషయాలతో సమయాన్ని వృథా చేయకుండా సభ్యులంతా ప్రజా సమస్యలపై మాట్లాడాలన్నారు.
సభాపతి స్థానంలో ఎవరున్నా కేవలం రూలింగ్ లేదా ఆదేశాలు మాత్రమే ఇవ్వగలరన్నారు. సభలో మాట్లాడేందుకు అవకాశమిస్తూ సభ్యుడి పేరును పిలిచినప్పుడు, స్పీకర్ ఆదేశాల మేరకు అక్కడున్న సిబ్బంది సంబంధిత వ్యక్తికి మైక్ కనెక్షన్ ఇస్తారు.. అంతే తప్ప చైర్ లో కూర్చొన్న వ్యక్తికి గానీ, ప్రిసైడింగ్ అధికారులకుగానీ మైక్ ను ఆపరేట్ చేసే అవకాశం ఉండదన్నారు.
Also Read: పార్లమెంట్లో శివాలెత్తిన రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీపై ఫైర్..
సభాపతి స్థానంలో స్పీకర్ లేనప్పుడు సభను సజావుగా నడిపేందుకు ఏర్పాటు చేసిన స్పీకర్ ప్యానెల్ లోని అన్ని పార్టీల సభ్యులుంటారన్నారు. ఇది స్పీకర్ స్థానానికి ఉన్న గౌరవానికి సంబంధించిన అంశం.. కనీసం ప్యానెల్లో ఉన్నవారైనా ఇలాంటి ఆరోపణలు చేయకూడదన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత సురేశ్ కూడా స్పీకర్ ప్యానెల్ లో ఉన్నారన్నారు. మైక్ ను సభాపతి కంట్రోల్ చేయగలరో.. లేదో ? అనేది కనీసం ఆయనైనా చెప్పాలన్నారు.