9 Killed in Road Accident In Rajasthan: రాజస్థాన్లోని కరౌలీలో బొలెరో- ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. బొలెరోలో ఉన్న నలుగురికి గాయాలు కాగా, వారిని కరౌలి జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. కరౌలి-మండ్రాయల్ రహదారిపై సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కరౌలి-మండ్రాయల్ రహదారిలోని దుండపురా మలుపు వద్ద వేగంగా వస్తున్న కారు, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.
ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాదం జరిగినప్పుడు పెద్ద శబ్దం రావడంతో స్థానికులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. వెంటనే పోలీసులకు, అంబులెన్స్కు సమాచారం అందించారు స్థానికులు.
పోలీసులు క్షతగాత్రులందరినీ కరౌలి జిల్లా ఆసుపత్రికి తరలించారు, అక్కడ వైద్యులు తొమ్మిది మంది మరణించినట్లు ప్రకటించారు. గాయపడిన నలుగురిని ఆసుపత్రికి తరలించారు.
ప్రమాద వార్త తెలియగానే కలెక్టర్ నీలభ్ సక్సేనా, ఎస్పీ బ్రిజేష్ జ్యోతి ఉపాధ్యాయ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. ఏడీఎం రాజ్వీర్ చౌదరి ఆసుపత్రిని సందర్శించి క్షతగాత్రుల పరిస్థితిని పరిశీలించారు.