Gambhir or Raman? Who will Take over as India’s New Head Coach: టీ 20 ప్రపంచకప్ ను టీమ్ ఇండియా గెలవడం, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియడం ఏకకాలంలో జరిగిపోయింది. జులై 1 నుంచి టీమ్ ఇండియాకి కొత్తకోచ్ గా ఎవరుంటారనేది ఇక తేల్చాల్సి ఉంది. ఇప్పుడు బంతి బీసీసీఐ కోర్టులో ఉంది. ప్రస్తుతం ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు గౌతమ్ గంభీర్ అయితే, మరొకరు డబ్ల్యూవి రామన్.
ప్రస్తుతమైతే అందరూ గౌతం గంభీర్ వైపే మొగ్గు చూపిస్తున్నారు. అలాగే డబ్ల్యూవీ రామన్ కి కూడా విలువైన బాధ్యతలు అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే తను అందించిన రోడ్ మ్యాప్ కూడా బీసీసీఐ కమిటీకి నచ్చడమే అందుక్కారణమని అంటున్నారు.
కొత్త హెడ్ కోచ్ అంశంపై జైషా మాట్లాడుతూ కొన్ని విషయాలను చెప్పీ చెప్పకుండా చెప్పి, కొన్ని హింట్లు ఇచ్చాడు. జులై 26, 2024 నుంచి ప్రారంభమయ్యే శ్రీలంక సిరీస్ కు కొత్త కోచ్ అందుబాటులోకి వస్తాడని తెలిపాడు. అయితే అంతకుముందు జులై 6 నుంచి ప్రారంభమయ్యే జింబాబ్వే సిరీస్ కు మాత్రం వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్ గా వెళతాడని వివరించారు.
నిజానికి రాహుల్ ద్రవిడ్ కి ఇంట్రస్ట్ ఉంటే, మరోసారి అప్లై చేసుకోమని బీసీసీఐ బంపర్ ఆఫర్ ఇచ్చింది. కానీ తను దానిని తిరస్కరించాడు. ఎందుకంటే 2023లో వన్డే ప్రపంచకప్ తర్వాత తన పదవీ కాలం అయిపోయింది. బీసీసీఐ రిక్వెస్ట్ చేయడంతో టీ 20 వరల్డ్ కప్ వరకు అయిష్టంగానే ఒప్పుకున్నాడు. ఇక లాభం లేకపోవడంతో బీసీసీఐ కొత్త కోచ్ ల వేటలో పడింది.
Also Read: ఆ హీరోయిన్ రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ.. ఇన్స్టాగ్రామ్లో ఎక్కువమంది లైక్ చేసిన ఫొటో ఇదే
ఐపీఎల్ లో ఎక్కడో ఉన్న కోల్ కతా ను వెలుగులోకి తీసుకువచ్చి, ట్రోఫీ గెలవడంలో కీలకపాత్ర పోషించిన గౌతం గంభీర్ పేరు ప్రముఖంగా వినిపించింది. క్రికెట్ అడ్వయిజరీ కమిటీ కూడా గంభీర్ వైపే మొగ్గు చూపడం విశేషం.
జులై 27 నుంచి శ్రీలంకలో పర్యటించే భారత జట్టు 3 టీ ట్వంటీలు, 3 వన్డేలు ఆడనుంది. కనీసం పదిరోజుల ముందు నుంచే భారత శిబిరం మొదలవుతుంది. అంతకు పదిరోజుల ముందే కొత్త కోచ్ అడుగుపెట్టాల్సి ఉంటుంది. తన బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ కోచ్ లను తెచ్చుకోవాల్సి ఉంటుంది. వారిని రెడీ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే వారం రోజుల్లోనే కొత్త కోచ్ పై బీసీసీఐ ఒక నిర్ణయానికి వస్తుందని అంటున్నారు.