Weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రానున్న రెండు రోజులు పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ, కేరళ, ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
ఇదిలా ఉంటే కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ పలు హెచ్చరికలను జారీ చేసింది. రుతుపవనాల ప్రభావంతో రానున్న రెండు రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మహారాష్ట్ర – కేరళ తీరం వెంబడి ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది. మధ్య గుజరాత్ పరిసర ప్రాంతాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లిడించింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో ఆరు జిల్లాల్లోని పాఠశాలలను మూసివేశారు.
తెలంగాణలో అల్పపీడనం ప్రభావంతో కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల పల్లి, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్ , ఆదిలాబాద్, నిజామాబాద్ తో పాటు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. శుక్రవారం నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, జయంశంకర్ భూపాల్ పల్లి, కరీంనగర్ సిద్దిపేట్, సిరిసిల్ల, జనగామతో పాటు పలు జిల్లాలోని వర్షాలు కురిసాయి.
Also Read: భారీ వర్షానికి కూలిన పై కప్పు.. ముగ్గురు చిన్నారులు మృతి
అల్పపీడనం, రుతుపనాలు చురుకుగా కదులుతుండటంతో ఉత్తర కోస్తా ప్రాంతానికి వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 55 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. అంతే కాకుండా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. రానున్న రెండు రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ పలు సూచనలు చేసింది.