England Won Last Two T20 Matches : టీ 20 ప్రపంచకప్ లో మొదటి సెమీఫైనల్ చప్పగా ముగిసిపోయింది. సౌతాఫ్రికా సునాయాసంగా ఆఫ్గాన్ పై గెలిచి తొలిసారి ఫైనల్ లో అడుగుపెట్టింది. మరి రెండో సెమీఫైనల్ లో అలా జరిగే అవకాశమే కనిపించడం లేదు. ఎందుకంటే టీ 20లో ఇంగ్లాండ్ కి ఉన్న బలం వేరు. అంతేకాదు టీమ్ ఇండియాకి సమఉజ్జీగా కూడా ఉంది. ఎందుకంటే భారత్ తో జరిగిన ఆఖరి రెండు టీ 20ల్లో ఇంగ్లండ్ గెలవడం విశేషం.
మొత్తం నాలుగు మ్యాచ్ లు చూస్తే మొదటి రెండు ఇండియా గెలిస్తే, చివర రెండు ఇంగ్లండ్ గెలిచింది. ఇప్పుడు చదవడానికి మనసుకి కొంత ఉపశమనంగా ఉంది. అయితే సెమీఫైనల్ మ్యాచ్ లో ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి నాకౌట్ మ్యాచ్ ల్లో అందరూ సీనియర్లపైనే ఫోకస్ పెడతారు. ఇప్పుడు టీమ్ ఇండియాలో ఉన్న ఇద్దరు సూపర్ సీనియర్లు విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ ఎలా ఆడతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సూపర్ 8 చివరి మ్యాచ్ లో ఆస్ట్రేలియాని ఊచకోత కోసిన రోహిత్ శర్మ మళ్లీ టచ్ లోకి వచ్చాడు. అయితే విరాట్ ఇంకా బ్యాట్ ఝుళిపించలేదు. మరి ఈ మ్యాచ్ లో ఎలా ఆడతాడనే దానిపై అందరిలో టెన్షన్ నెలకొంది. సాధారణ మ్యాచ్ ల్లో ఆడటం వేరు, నాకౌట్ మ్యాచ్ ల్లో ఆడటం వేరు. ఇలాంటి చోట విరాట్ స్ట్రయిక్ రేట్ చాలా బాగుంది. అందరూ అదే ఆశతో ఉన్నారు.
Also Read : ఇండియా – ఇంగ్లండ్ సెమీఫైనల్ మ్యాచ్.. రసవత్తర పోరు
విరాట్-రోహిత్ కలిసి ఆడితే మాత్రం ప్రత్యర్థి జట్లకి హడల్ అంటున్నారు. కానీ ఆ మ్యాజిక్ టీ 20 ప్రపంచకప్ లో ఇంతవరకు జరగలేదు. నిజంగా ఆడితే ఇంగ్లండ్ ఇంటి దారి పట్టడం ఖాయమని అంటున్నారు. అయితే కొహ్లీకి మాత్రం ఇంగ్లండ్ జట్టులో ఆదిల్ రషీద్ రూపంలో ముప్పు పొంచి ఉంది. తన బౌలింగులో ఇప్పటివరకు 9 సార్లు అవుట్ అయిపోయాడు.
రోహిత్ శర్మ అయితే లెఫ్టార్మ్ పేసర్లకి వికెట్లు సమర్పించుకుంటాడనే అపప్రథ ఉంది. ఆస్ట్రేలియా మ్యాచ్ తో అది చెరిగిపోయింది. కానీ ఇంగ్లండ్ సీమర్ జోప్రా ఆర్చర్ బౌలింగులో మూడుసార్లు అవుట్ అయ్యాడు. పరుగులు కూడా తీయడానికి సతమతమవుతున్నాడు. మరి వీరిని మన సూపర్ హీరోలు అడ్డుకుని ముందడుగు వేస్తే తిరుగుండదని అంటున్నారు.