America on Pak Elections: పాకిస్తాన్లో జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికలపై సమగ్ర విచారణ జరపాలని అమెరికా ప్రతినిధుల సభ తీర్మానం చేసింది. దీనిని రెండు ప్రధాన పార్టీలు దాదాపు ఏకగ్రీవంగా ఆమోదించాయి. పాక్లో ప్రభుత్వం, మానవ హక్కుల పరిరక్షణ, చట్టబద్ధ పాలనకు పిలుపునిస్తూ ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు.
భద్రతా సవాళ్లు, తీవ్ర ఆర్థిక సంక్షోభం మధ్య జీవిస్తున్న పాక్ ప్రజల హక్కుల పరిరక్షణ కీలకం అని తీర్మానంలో పేర్కొన్నారు. అంతే కాకుండా నిస్పక్షపాత ఎన్నికలు, ప్రజాస్వామ్య పరిరక్షణలో అక్కడి ప్రజలకు అమెరికా అండంగా ఉంటుందని తెలిపారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సామాన్య ప్రజల మెరుగైన భవిష్యత్తు కోసం అవినీతిని అరికడుతూ చట్టబద్ధమైన పాలనను అందించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. పాక్ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామ్యం కాకుండా బెదిరంచడం, హింసలకు పాల్పడటం, ఇంటర్నెట్పై ఆంక్షలు వంటి చర్యలను అమెరికా తీవ్రంగా ఖండించింది.
అమెరికా తీర్మానంపై విదేశాంగ శాఖ కూడా స్పందించింది. తమ దేశ రాజకీయాలపై పూర్తి స్థాయి అవగాహన లేకుండా చేసిన చర్యగా దీనిని అభివర్ణించింది. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్న సమయంలో ఇలాంటి తీర్మానం రావడం సమంజసం కాదని తెలిపింది. రాజ్యాంగ విలువలు, చట్టబద్ధ పాలన, మానవ హక్కులకు పాక్ కట్టుబడి ఉందని చెప్పుకొచ్చింది.
Also Read: నేడే ట్రంప్, బైడెన్ బిగ్ డిబేట్..నాలుగేళ్లలో తొలిసారి!
ఈ ఏడాది ఫిబ్రవరిలో పాక్ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో తీవ్ర అవకతవకలు జరిగినట్లు అక్కడి ప్రధాన రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇంటర్నెట్ పై ఆంక్షలు, హింసాత్మక చర్యలు, రిగ్గింగ్ వంటి ఘటనలు జరిగాయి. అయితే నిర్భందంలో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో పాటు చాలా మంది ఈ ఎన్నికల ఫలితాలను వ్యతిరేకించారు. ఇమ్రాన్ పార్టీకి మద్దతుగా నిలిచిన స్వతంత్ర అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలుపొందారు. కానీ చివరికి పాక్ లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అయింది. షెహబాజ్ షరీఫ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.