PCB Set to Enforce Code of Conduct on Pakistan Players after T20 WC 2024 Debacle: టీ 20 ప్రపంచకప్ లో గ్రూప్ దశలోనే ఓటమిపాలైన పాకిస్తాన్ ఆటగాళ్లు ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుతున్నారు. అయితే వీరు అమెరికాలో క్రికెట్ ఆడటంతో అక్కడే కొన్నాళ్లు ఉన్నారని అంటున్నారు. ఆ తర్వాత కొందరు లండన్ వెళ్లారని చెబుతున్నారు. ఏ నైట్ విత్ స్టార్స్ పేరుతో జరిగే ఈవెంట్లలో వీరందరూ పాల్గొన్నారని అంటున్నారు. అందుకోసం డబ్బులు భారీగా దండుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కొందరు మాత్రం ఎంతో కొంత ఇచ్చినా చాలు వస్తామని అన్నట్టు వినికిడి.
టీ 20 ప్రపంచకప్ కోసం కొందరు భార్యా పిల్లలతో వెళ్లారు. కొందరు సోదరులతో వెళితే, కొందరు తల్లిదండ్రులను తీసుకువెళ్లారు. వీరందరూ కూడా ఆటగాళ్లకిచ్చిన హోటల్ రూమ్స్ లోనే ఉన్నారంట. ఈ అంశంపై కూడా పీసీబీ సీరియస్ అయ్యింది. కొందరు ఆస్ట్రేలియా క్రికెటర్ల విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
ఒకసారి టెస్ట్ క్రికెట్ ప్రాక్టీసు జరుగుతుండగా డేవిడ్ వార్నర్ కుటుంబం గ్రౌండుకి దూరంగా ఉన్న ఫెన్సింగ్ దగ్గరకు వచ్చింది. అప్పుడు వార్నర్ ఫెన్సింగ్ ఇవతలే ఉన్నాడు. అవతల వైపున్న పిల్లలు, భార్యతో కాసేపు మాట్లాడాడు. నువ్వెక్కడైనా బావగానీ, వంగతోట దగ్గర కాదనే సామెత ఉంది. అలాగే తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అన్నట్టు క్రికెట్.. క్రికెట్టే.. ఫ్యామిలీ, ఫ్యామిలీయే అంటున్నారు.
Also Read: తొలిసారి ఫైనల్ కి వెళ్లిన సౌతాఫ్రికా.. కీలక మ్యాచ్ లో ఓడిన ఆఫ్గాన్
ప్రపంచకప్ కోసం మొత్తం కుటుంబ సభ్యులనే వీళ్లందరూ ఏసుకొచ్చేశారు. అంతేకాదు షహీన్ ఆఫ్రిది, బాబర్ అజామ్ ఇలా క్రికెటర్లందరూ రెండు గ్రూపులుగా విడిపోయారనే విమర్శలు వచ్చాయి. అంతేకాదు వీరికి పేమెంట్ల విషయంలో కూడా వ్యత్యాసాలు ఉన్నట్టు తెలిసింది.
ఇక అమెరికాలోని డల్లాస్ లో అయితే చాలా తక్కువ డాలర్లకి, ఒక ఈవెంట్ లో పాల్గొనడానికి వీళ్లు వెళ్లారనే వార్తలు వచ్చాయి. ఇలా పాకిస్తాన్ పరువు తీసి పారేశారని ఆ బోర్డు చైర్మన్ మోసిన్ నక్వీ సీరియస్ అయినట్లు తెలిసింది. వెంటనే తిరిగి ఇళ్లకు రమ్మనమని హుకుం జారీ చేశారని అంటున్నారు. భవిష్యత్తులో ఆటగాళ్లను క్రమశిక్షణలో పెట్టేందుకు కఠినమైన నిబంధనలు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పాకిస్తాన్ క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.