MLC Jeevan Reddy Comments after meeting with Venugopal: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలక వీడారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీనే ముఖ్యమంటూ ఆయన పేర్కొన్నారు. మారుతున్న పరిస్థితుల కారణంగా కొన్ని నిర్ణయాలు తప్పవన్నారు. కార్యకర్తలను కాపాడుకోవడం చాలా ముఖ్యమని, ఏ పార్టీకైనా వారే కీలకమన్నారు. సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ హామీ ఇచ్చారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
లోక్ సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేస్తోందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో రుణ మాఫీ చేయలేదన్నారు. కానీ, తమ ప్రభుత్వం మాత్రం రూ.31 వేల కోట్లు రుణమాఫీ చేయబోతుందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపదాస్ మున్షీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరికలకు డోర్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి ప్రాధాన్యత తగ్గదు. పార్టీలో జీవన్ రెడ్డి సీనియర్. ఆయనను కించపరచడం మా ఉద్దేశం కాదు. జగిత్యాల ఎమ్మెల్యే చేరిక వల్ల అమర్యాద, అగౌరవంగా ఆయన భావించారు. ఏ నిర్ణయం తీసుకున్నా ఆయనతో చర్చించే ముందుకెళ్తాం. పీసీసీ పదవీ కాలం ముగింపు అంటూ ఏమీలేదు. పీసీసీపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది’ అని ఆమె పేర్కొన్నారు.
Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు రిజర్వు
పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందంటూ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అంతానికి యత్నించినట్లు ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరిస్తోందంటూ మంత్రి పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. తన సొంత నియోజకవర్గమైన జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ను పార్టీలోకి చేర్చుకోవడంతో జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు తదితరులు చర్చలు జరిపినా ఆయన శాంతించలేదు. తన ప్రమేయం లేకుండా జరగాల్సింది జరిగిపోయిందంటూ జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
దీంతో హైకమాండ్ రంగంలోకి దిగింది. తమ దూతగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపదాస్ మున్షీకి జీవన్ రెడ్డితో చర్చలు జరపాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మున్షీ జీవన్ రెడ్డికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. బుధవారం ఢిల్లీకి రావాల్సిందిగా హైకమాండ్ నుంచి జీవన్ రెడ్డికి ఫోన్ వచ్చింది. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ జీవన్ రెడ్డిని వెంటబెట్టుకుని ఢిల్లీకి వెళ్లారు. అనంతరం అక్కడ అగ్రనేతలతో సమావేశమయ్యారు.