Retired officers resigned their jobs(AP latest news): ఏపీలో గత ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో నియమితులైన రిటైర్డ్ అధికారులు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. ఇక, ఆ రాజీనామాలకు ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా రాజీనామాలు చేసినవారి విషయానికి వస్తే.. విజిలెన్స్ కమిషనర్ వీణా ఈష్, లా సెక్రటరీ సత్య ప్రభాకర్ రావు, పట్టణాభివృద్ధి శాఖ అడిషనల్ సెక్రటరీ ఎం. ప్రతాప్ రెడ్డి, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ వీణా ఈష్ సహా వివిధ హోదాల్లో ఉన్న వెంకట రమణారెడ్డి, సుధాకర్, మల్లికార్జున రాజీనామాలు చేశారు. ఈ నేపథ్యంలో వారి రాజీనామాలను ఆమోదిస్తూ సీఎస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
గోపాలకృష్ణ ద్విదేది బదిలీ
మరో విషయమేమంటే.. సీనియర్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ ద్విదేదిని రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఇటీవల వ్యవసాయ, గనుల శాఖ నుంచి కార్మిక శాఖకు ద్వివేది బదిలీ అయ్యారు. అయితే, ద్వివేదికి కార్మికశాఖ బాధ్యతలు అప్పగించడంపై అధికారుల్లో అంతర్గతంగా చర్చ కొనసాగింది. పశుసంవర్థక శాఖ కార్యదర్శి నాయక్ కు కార్మికశాఖ పూర్తి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.
Also Read: గత ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది: మంత్రి పార్థసారథి
ఎలాంటి చెల్లింపులు చేయవద్దు
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో గ్రామ, వార్డు వాలంటీర్లకు దినపత్రిక కొనుగోలు కోసం గతంలో ఇచ్చే అలవెన్స్ ను ప్రభుత్వం రద్దు చేసింది. న్యూస్ పేపర్ అలవెన్సు కోసం ఎలాంటి చెల్లింపులు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్లు పత్రిక వేయించుకోవాలంటూ రూ. 200 చెప్పున చెల్లిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై గతంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.