KCR Approached to TS High Court(Telangana today news): తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో రైల్ రోకో సందర్భంగా తనపై నమోదైనటువంటి కేసు విషయమై ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ప్రజాప్రతినిధుల కోర్టులో తనపై ఉన్న కేసును కొట్టివేయాలంటూ అందులో కోరారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2011 అక్టోబర్ లో రైల్ రోకోకు కేసీఆర్ పిలుపునిచ్చారంటూ మల్కాజిగిరి పోలీసులు కోర్టుకు నివేదిక అందజేశారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు, రైల్వే ఉద్యోగులకు ఆటంకం కలిగించారని ఆ నివేదికలో పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన కేసీఆర్.. తాను ఎలాంటి రైల్ రోకోకు పిలుపునివ్వలేదంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. ఎవరో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసులు నమోదు చేశారన్నారు. ఈ కేసులో తనను 15వ నిందితుడిగా చేర్చారని.. అసలు తాను రైల్ రోకోలోనే పాల్గొనలేదంటూ అందులో వివరించారు. రైల్ రోకో ఘటన తరువాత మూడేళ్లకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యిందని, ఈ కేసుకు ఎలాంటి బలం లేదని తెలిపారు. అందువల్ల కేసును కొట్టేయాలంటూ విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ పిటిషన్ పై మంగళవారం రాష్ట్ర హైకోర్టు విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. త్వరలో సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ పై గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. ప్రజల తీర్పునకు వ్యతిరేకంగా తమ పార్టీని వీడిని కాంగ్రెస్ లో చేరుతున్న ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Also Read: బీఆర్ఎస్ నేతలకు గతాన్ని గుర్తుచేసిన షబ్బీర్ అలీ.. మిమ్మల్నే ఫాలో అవుతున్నామంటూ..
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరి మూడు నెలలు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ఇప్పటికే న్యాయ నిపుణులతో బీఆర్ఎస్ పార్టీ చర్చించినట్లు టాక్ వినిపిస్తోంది.