Update on Arvind Kejriwal Bail Petition: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్కు నిరాశే ఎదురైంది. న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కాపీ చూడకుండా ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో తదుపరి విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది న్యాయస్థానం.
ఇంకా లోతుల్లోకి వెళ్తే.. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసింది ట్రయిల్ కోర్టు. దీనిపై ఢిల్లీ హైకోర్టుకు వెళ్లింది ఈడీ. వెంటనే కింది కోర్టు ఆదేశాలపై 24 గంటల్లో స్టే ఇచ్చింది. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్.
కేజ్రీవాల్ వేసిన పిటీషన్పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరిగింది. ముఖ్యంగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు తర్వాతే దానిపై పరిశీలన చేస్తామని వెల్లడించింది. తీర్పు కాపీ చూడకుండా ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంది. దీంతో పిటిషన్పై విచారణ జూన్ 26న(బుధవారం) చేపడతామని స్పష్టం చేసింది.
Also Read: పీఎం మోదీకి ఖర్గే కౌంటర్.. ఇంకెంతకాలం అవే మాటలు
గతవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తు సమర్పించాలని షరతు విధించింది. ఈ తీర్పుపై అప్పీల్ చేసేందుకు తమకు 48 గంటలు గడువు ఇవ్వాలని ఈడీ కోరినప్పటికీ న్యాయస్థానం తిరస్కరించింది. మరుసటి ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టింది ఈడీ. తమ వాదనలు వినేందుకు గడువు ఇవ్వలేదని అందులో ప్రస్తావించారు. వారి వాదనలో ఏకీభవించిన ఢిల్లీ హైకోర్టు, ట్రయిల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. ఈ క్రమంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించారాయన.