CM Revanth Reddy about Chandrababu(TS news updates): బసవతారకం ఆస్పత్రి లక్షల మందికి సేవలు అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి 24 వ వార్షికోత్సవం కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడారు. నిస్వార్థంగా పేదలకు సేవలు అందించేందుకు ఈ ఆస్పత్రిని నిర్మించారని, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దారని కొనియాడారు.
ఏపీ సీఎం చంద్రబాబుతో అభివృద్ధిలో పోటీ పడే అవకాశం వచ్చిందని సీఎం రేవంత్ అన్నారు. ఆయన 18 గంటలు పనిచేసి.. నేను 12 గంటలు పనిచేస్తే సరిపోదన్నారు. తెలంగాణలోని రాష్ట్ర మంత్రులు, అధికారులు సైతం 18 గంటలు పనిచేయాల్సిందేనని వెల్లడించారు. అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు పోటీ పడాలని, ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలన్నారు. అదే విధంగా హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
Also Read: తెలంగాణలో ఊకదంపుడు ఉపన్యాసాలకే బీజేపీ పరిమితమా ?
క్యాన్సర్ మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తుందని బసవతారకం ఆస్పత్రి చైర్మన్, మేనిజింగ్ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆస్పత్రి సేవల విస్తరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి సహకారం కోరామని, ఆయన దీనికి అంగీకరించినట్లు బాలకృష్ణ తెలిపారు. దాతల సహకారంతో ఆస్పత్రి ఈ స్థాయికి చేరుకుందని చెప్పారు. ఈ సేవలను మరింత విస్తరించాలని కోరారు. అనంతరం ఆస్పత్రి సేవల విస్తరణకు 10 ఎకరాలు కేటాయించాలని కోరినట్లు మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.