Illicit Liquor Deaths : తమిళనాడులోని కళ్లకురిచ్చి కల్తీసారా తాగిన ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు చికిత్స పొందుతూ 52 మంది మరణించారు. ఈ సంఖ్య మరింత పెరగవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రుల్లో 113 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో సుమారు 30 మంది పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. కల్తీసారా దుర్ఘటన, వైఫల్యాలను రాష్ట్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటోందని ఇప్పటికే హైకోర్టు తప్పుపట్టింది.
తాజాగా ఈ ఘటనపై హీరో సూర్య స్పందించారు. ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు గుప్పించారు. చిన్న ఊరులో 50 మరణాలు ఆందోళనకరమన్నారు. తుపాను, వరదలువంటి విపత్తు కాలాల్లోనూ చోటుచేసుకోని విషాదమని ట్వీట్ చేశారు. వరుసగా పెరుగుతున్న మరణాలు, బాధితుల ఆక్రందన మనసును వణికిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది విళుపురం జిల్లాలో మిథనాల్ కలిపిన కల్తీసారా తాగి 22 మంది మరణించగా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. అయితే ఆ దిశగా ప్రభుత్వం పనిచేయలేదనడానికి ప్రస్తుత ఘటన నిరూపిస్తోందని తెలిపారు.
మద్యం తాగేవాళ్లు డబ్బు లేనప్పుడు 50 రూపాయలతో కల్తీసారా తాగి బానిసవుతున్నారన్నారు సూర్య. ఈ క్రమంలోనే కల్తీ సారాకు ఆస్కారం దొరుకుతుందని చెప్పారు. మద్యనిషేధ విధానంలో ముఖ్యమంత్రి ప్రజా ప్రయోజన నిర్ణయాన్ని తీసుకుంటారని ఆశిస్తున్నానని.. ఇప్పటికైనా కల్తీసారా అడ్డుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.
இனி ஒரு விதி செய்வோம்..! அதை எந்நாளும் காப்போம்..! #Kallakkurichi pic.twitter.com/z3lTZLtdYs
— Suriya Sivakumar (@Suriya_offl) June 21, 2024